- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ ప్రభుత్వంపై ఖర్గే ధ్వజం.. లేబర్ కోడ్ల అమలుపై తీవ్ర విమర్శలు
కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకురావడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. ఇది కార్మికుల హక్కులకు గొడ్డలి పెట్టు అని విమర్శిస్తూ, కాంగ్రెస్ ఐదు పాయింట్ల శ్రామిక్ న్యాయ్ ఎజెండాను ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్ల అమలుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వేచి చూసిన మోడీ ప్రభుత్వం (Modi Govt.), గత వారం (మే 8, 9 తేదీల్లో) గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా ఈ కార్మిక వ్యతిరేక చట్టాలను దొంగచాటుగా అమల్లోకి తెచ్చిందని ఆయన విమర్శించారు. ఈ కొత్త కోడ్లు దేశంలోని కోట్లాది మంది కార్మికుల హక్కులను కాలరాస్తాయని, 'హైర్ అండ్ ఫైర్' (ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడం, తీసివేయడం) విధానాన్ని ప్రోత్సహిస్తాయని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున 'శ్రామిక్ న్యాయ్' (Shramik Nyay) పేరుతో ఐదు పాయింట్ల ఎజెండాను ఖర్గే ప్రకటించారు. ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) పట్టణ ప్రాంతాలకు విస్తరించడం, కనీస వేతనాన్ని రోజుకు రూ. 400కి పెంచడం, రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించడం మరియు అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు నియామకాలను నిలిపివేస్తామని, మోదీ ప్రభుత్వం నీరుగార్చిన కార్మిక చట్టాలను తిరిగి సమీక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు.






