నామా నాగేశ్వర రావు జన్మదిన వేడుకల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు

by Disha Web Desk 13 |
నామా నాగేశ్వర రావు జన్మదిన వేడుకల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు
X

దిశ, అశ్వారావుపేట: సాధారణంగా రాజకీయ నేతల పుట్టినరోజు వేడుకల్లో శుభాకాంక్షలు తెలుపుతూ పొగడ్తలతో ముంచెత్తుతారు. అయితే అందుకు భిన్నంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఖమ్మం ఉమ్మడి జిల్లా ఎంపీ నామా నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకల్లో గతంలో ఇచ్చిన దత్తత హామీలపై సొంత పార్టీ వారే పెదవి విరవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మంగళవారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహం ప్రాంగణంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పుట్టినరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బర్త్ డే కేక్ కటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ గా నామా నాగేశ్వరరావు అశ్వారావుపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారని.. నియోజకవర్గ కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి అన్ని విధాల అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ కూడా ఇచ్చారని.. కాబట్టి పుట్టినరోజు సందర్భంగా ప్రజా ప్రతినిధులు వినతి పత్రాన్ని విడుదల చేసి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే బాగుంటుందని కొందరు నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


అయితే ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కు ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పోలైన అశ్వారావుపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే దత్తత హామీలను పూర్తి చేస్తానంటూ తెలిపిన సందర్భాలు ఉన్నాయి.

అదేవిధంగా అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ ను వితరణగా ఇచ్చారు. కానీ పలు కారణాల వల్ల అంబులెన్స్ సేవలు పూర్తిస్థాయిలో అందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సదుద్దేశంతో అమలు చేసిన ఒక హామీ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పుకోవాలి. దత్తత తీసుకోవడం అంటే ప్రత్యేకమైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే, అటువంటిది సాధారణ పర్యటనలకు సైతం ఎంపీ నామా అశ్వారావుపేట నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువే.


ఈ నేపథ్యంలోనే ఎంపీ నామా నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకల్లో స్థానిక టీఆర్ఎస్ నాయకులు హామీల పై దృష్టి పెట్టాలని వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అయితే రాజకీయ పెద్దల పుట్టినరోజు అనేది శుభాకాంక్షలు తెలిపేందుకు వారి గత ఘనకార్యాలను వివరించేందుకు వేదిక అవుతుంటుంది. కానీ పలు కారణాల వల్ల అమలు చేయలేక పోయినా హామీలను ఎత్తిచూపుతూ వ్యాఖ్యలు చేసేందుకు వేదిక అవ్వడం.. అది కూడా సొంత పార్టీ నాయకులే ఈ వ్యాఖ్యలకు పాల్పడడం గమనార్హం.



Next Story