శివ నామ స్మరణతో మారుమోగిన 'కీసర గుట్ట'

by Web Desk |
శివ నామ స్మరణతో మారుమోగిన కీసర గుట్ట
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, కీసరగుట్ట శ్రీరామ లింగేశ్వర స్వామి ఆలయం 'శివనామ స్మరణతో' మారుమోగిపోయింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీ రామలింగేశ్వరున్ని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హైదరాబాద్ నగర చుట్టు ఉన్న ప్రాంతాలు, మేడ్చల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. భక్తులతో కీసర గుట్ట కిటకిటలాడిపోయింది.

"ఓం నమ శివాయ", హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు నినదిస్తూ, భక్తి పారవశ్యంతో మహాదేవుని దర్శనం చేసుకుని, తన్మయత్వం పొందారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో ఉదయం 4 గంటల నుంచి మహాశివునికి మహా న్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు, రుద్ర స్వాహకార హోమం, నదివాహన సేవలతో పాటు రాత్రి 12 గంటల వరకు అభిషేకాలు నిర్వహించారు.

ప్రముఖుల దర్శనం..

మహాశివరాత్రి రోజు మంగళవారం చాలా మంది ప్రముఖులు కీసరగుట్ట శ్రీ రామ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇందులో.. మంత్రి మల్లారెడ్డి, కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్ష్ రావు, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ నర్సింహరెడ్డి, డీఆర్వో లింగ్య నాయక్, డిసిపి రక్షిత మూర్తి, ప్రజా ప్రతినిధులు ఎమ్మేల్యేలు బేతి సుభాష్ రెడ్డీ, మైనంపల్లి హన్మంతరావు రావు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి, మల్కాజి గిరి పార్లమెంట్ తెరాస ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులున్నారు.

ఇదిలా ఉండగా, మహా శివుణ్ణి దర్శనం చేసుకోవటానికి భక్తులు నాలుగైదు గంటలు క్యూలో నిలబడాల్సి వచ్చింది. అధికారులు ఎవరికి పడితే వారికి వీఐపీ పాసులు ఎక్కువగా ఇవ్వటం వల్లే సామాన్యులు ఇబ్బందుల పాలయ్యారని భక్తులు అభిప్రాయ పడ్డారు. భక్తుల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ అభయమిచ్చినా.. క్యూలో గంటల కొలది నిలబడిన భక్తులు మంచినీటి కోసం ఎంతో ఇబ్బంది పడ్డారు.

తులసి ఫౌండేషన్ సంస్థ భక్తుల కోసం పాలు, శ్రీ తులసి మోటార్స్ సంస్థ మంచినీటి ప్యాకెట్లు సరఫరా చేయటం కొంత ఊరట కల్గించింది. సోమవారం రాత్రి శ్రీ రామలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, జిల్లా కలెక్టర్ హరీశ్​దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పోలీసుల ఓవరాక్షన్..



పోలీసులు భక్తులకు చుక్కలు చూపించారు. ఏదైనా సమాచారం అడిగిన భక్తులకు ఇవ్వకుండా దురుసుగా వ్యవహరించారు. పూజారులు, ఆలయ సిబ్బంది, పోలీసులు తమ బంధువులు, అధికారులకు ఈజీగా దర్శనం చేయించే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు వీఐపీ పసులతో వచ్చిన వారిని ఇబ్బందులు పెట్టారు. వెహికల్ పాసులు జారీ హాస్యాస్పదంగా మారింది. పాసులు లేని వాహనాలను వేదా పాటశాల వరకు పంపి, ఉన్నా వాహనాలను మాత్రం అనుమతించక పోవడం విమర్శలకు తావిచ్చింది. కొందరు సిబ్బంది విధులను మరిచి సెల్ ఫోన్ తో కాలక్షేపం చేశారు.



Next Story

Most Viewed