అసెంబ్లీ నిర్వహణపై కేసీఆర్ అసంతృప్తి.. మంత్రులపై సీరియస్

by Disha Web Desk 2 |
అసెంబ్లీ నిర్వహణపై కేసీఆర్ అసంతృప్తి.. మంత్రులపై సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ నేతలపై గులాబీ బాస్ గుస్సా అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహించాలి.. అధికార పార్టీ సభ్యులు ఎలా వ్యవహరించాలి, ప్రతిపక్ష సభ్యులను ఎలా కట్టడి చేయాలో తెలుసుకోవాలని సూచించినట్లు సమాచారం. సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అధిక సమయం ఇవ్వడంపై కూడా సీరియస్ అయినట్లు సమాచారం. అదే విధంగా మంత్రి తలసానిపై ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఘాటుగా ఎందుకు తిప్పికొట్టలేదని కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే అసెంబ్లీ చివరి రోజూ కేంద్రంపై గులాబీ అధినేత విమర్శలు గుప్పించారనే చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ సమావేశాలు ఈనెల 7నుంచి 15వ తేదీ వరకు నిర్వహించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు మూడ్రోజులు మాత్రమే హాజరయ్యారు. అయితే అనారోగ్య కారణాలతో మరో నాలుగు రోజులు పాల్గొనలేదు. అయితే ఈ 7 రోజుల్లో సభ 54గంటల 47 నిమిషాల పాటు కొనసాగింది. ఇందులో ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 6 గంటల 15 నిమిషాలు మాట్లాడగా ఇందులో ప్లోర్ లీడర్ 3గంటల 7 నిమిషాల పాటు మాట్లాడారు. ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు 5 గంటల 17 నిమిషాలు మాట్లాడగా, అందులో ఎంఐఎం ప్లోర్ లీడర్ 3 గంటల 31 నిమిషాలు మాట్లాడారు. ఇదిలా ఉండగా అధికంగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 13 గంటల 42 నిమిషాలు మాట్లాడారు. ఇదిలా ఉంటే ప్రతి పక్షాల సభ్యులు మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వడంపై సీఎం కేసీఆర్ మందిలించినట్లు సమాచారం. ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రజల్లోకి నెగిటివ్‌గా వెళ్తుందని తెలియదా? అని ప్రశ్నించినట్లు సమాచారం. అలా వెళ్తే ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరుగుతుందని గతంలో ఎలా నిర్వహించారో ఒకసారి చూడాలని, బేరీజు వేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలపై సుదీర్ఘంగా మాత్రమే చర్చ జరగాలని సభా అధ్యక్షత బాధ్యత వహించిన వారికి సూచించినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ప్రశ్నోత్తరాల సమయంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను పదే పదే ప్రస్తావించడంపై కూడా సీఎం కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

పేకాట ఆడేటోళ్లు మంత్రి కాగా లేదని.. కాంట్రాక్టర్ ఎమ్మెల్యే కావడం తప్పా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మూడ్రోజుల క్రితం మంత్రి తలసానిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే సభలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఆశించిన స్థాయిలో ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టడంలో విఫలం అయ్యారని గులాబీ బాస్ గుస్సా అయినట్లు సమాచారం. అందరూ సభలో ఉండి ఏం చేశారని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే సీఎం కేసీఆర్ అసెంబ్లీ చివరి రోజున పాల్గొని కేంద్రం తెలంగాణపై అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టారని పలువురు చర్చించుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, జీడీపీ, ఎకానమీ రేటు, నిరుద్యోగిత రేటు, కేంద్రం అప్పులపై కేసీఆర్ నిప్పులు చెరిగారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed