పనికిరాని సలహాలు వినే ఓపిక లేదు.. నెపోటిజంపై కశ్మీరా

by Disha Web Desk |
పనికిరాని సలహాలు వినే ఓపిక లేదు.. నెపోటిజంపై కశ్మీరా
X

దిశ, సినిమా : ప్రముఖ నటి కశ్మీరా షా ఇండస్ర్టీలో నెపోటిజంపై అభిప్రాయాన్ని వెల్లడించింది. నిజానికి బంధుప్రీతి గురించి మాట్లాడటం తనకు ఇష్టం లేదంటూ ప్రతిభావంతులెవరూ దీని గురించి మాట్లాడరని చెప్పింది. అలాగే తాను సింగర్ అంజనీబాయి మల్పేకర్ వారసత్వంతో వచ్చినప్పటికీ మంచితనం, సొంత టాలెంట్‌తోనే ఎదిగానని.. భవిష్యత్తులో తన కుమారులు అరంగేట్రం చేసినా వారి రక్తంలో ఉండేది టాలెంట్ తప్ప బంధుప్రీతి కాదని తెలిపింది. 'నాకు అన్నీ అందించిన బాలీవుడ్ పరిశ్రమ గురించి పొసెసివ్‌గానే ఉన్నాను. సినీ కుటుంబానికి చెందకపోయినా ఇక్కడ గొప్ప పేరు తెచ్చుకున్నా. బంధుప్రీతి మాత్రమే పనిచేస్తుందని చెప్పడం ఇష్టం లేదు. మన కృషి, ప్రతిభ, పట్టుదలే మనల్ని స్టార్‌గా నిలబెడుతుంది. మీరు నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటే.. మీ ఫోన్‌ను పక్కనబెట్టి, నా పోస్ట్ చదవడం మానేసి, వెళ్లి మీ కలను సాధించే పనిలో ఉండండి. ఖాళీగా కూర్చొని పనికిరాని సలహాలు ఇవ్వడం ఆపండి. ఎందుకంటే నేను నా కలలు సాకారం చేసుకునే పనిలో ఉన్నందున వాటిని చదవడానికి సమయం లేదు. నాకు ఇంకా 25 ఏళ్ల పని మాత్రమే మిగిలి ఉంది. అందరికీ ధన్యవాదాలు' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.



Next Story