'ఈటల అంటే కేసీఆర్‌కు భయం.. అందుకే సస్పెన్షన్'

by Disha Web Desk 2 |
ఈటల అంటే కేసీఆర్‌కు భయం.. అందుకే సస్పెన్షన్
X

దిశ, హుజూరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతును అణగదొక్కాలనే కుట్రలో భాగంగానే శాసనసభ సమావేశాలు ప్రారంభమైన 15 నిముషాలకే బీజేపీ ఎమ్మెల్యేలు అయినటువంటి రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావును అసెంబ్లీ సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేశారన్నారు. ప్రభుత్వ డొల్లతనాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే కేసీఆర్ ప్రభుత్వం ఈ తప్పుడు విధానాలు అవలంభిస్తుందన్నారు.

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ముఖ్యమంత్రి నియంతలా మారి అసెంబ్లీ సభా మర్యాదలు మరిచి, గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారన్నారు. ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి భవిష్యత్‌లో ప్రజలే గుణపాఠం చెపుతారన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల రాజేందర్‌ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి ప్రభాకర్, రాముల కుమార్, బింగి కరుణాకర్, మాడ్గుల ప్రవీణ్ కుమార్, తూర్పాటి రాజు, దేవేందర్ రావు, చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, కొండల్ రెడ్డి, వినయ్, రాజశేఖర్, పోతుల సంజీవ్, నీరటి రమేష్, యాల్ల సంజీవరెడ్డి, రాసమల్ల వేణు, చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story