ఆస్కార్, గ్రామీ వేడుకలను బహిష్కరించాలి.. కంగన

by Disha Web Desk 17 |
ఆస్కార్, గ్రామీ వేడుకలను బహిష్కరించాలి.. కంగన
X

దిశ, సినిమా : 'గ్రామీ 2022' అవార్డ్స్ ప్రదానోత్సవంలో లెజెండరీ సింగర్, దివంగత లతా మంగేష్కర్‌‌ను స్మరించుకోకపోవడం పట్ల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన 'ఆస్కార్' ఈవెంట్‌లోనే కాక 'గ్రామీ' వేడుకల్లోనూ ప్రముఖ కళాకారులను విస్మరించారంటూ ఫైర్ అయింది. ఉద్దేశపూర్వకంగా గొప్ప వ్యక్తులకు నివాళులు అర్పించకుండా నిర్వహించే ఏ అవార్డుల కార్యక్రమాన్నయినా బలంగా వ్యతిరేకించాలని, పక్షపాత వైఖరి గల స్థానిక ఈవెంట్స్‌ను మీడియా సైతం బహిష్కరించాలని కోరింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ విషయాన్ని పంచుకున్న నటి.. 'ఈ స్నూటీ వెస్ట్రన్ అవార్డులను బహిష్కరించాలి' అంటూ అభిమానులకు పిలుపునిచ్చింది. కాగా 64వ గ్రామీ అవార్డ్స్‌ వేడుకలో అనేక మంది సంగీత ప్రముఖులకు నివాళులు అర్పించారు కానీ లతా మంగేష్కర్ పేరు ప్రస్తావించకపోవడం విమర్శలకు దారితీసింది. ఇక కంగనా డిమాండ్‌కు పలువురు రాజకీయ నాయకులు, నెటిజన్లు సైతం మద్ధతుగా నిలుస్తున్నారు.


Next Story