కొల్లాపూర్ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేసిన జూపల్లి

by Vinod kumar |

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/పెంట్లవెల్లి: గత - Jupally Krishna Rao made sensational remarks on Kolhapur MLA Harshavardhan Reddy

కొల్లాపూర్ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేసిన జూపల్లి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/పెంట్లవెల్లి: గత కొంత కాలంగా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి, కొల్లాపూర్ అధికార పార్టీ నేత జూపల్లి కృష్ణారావు గురువారం అధికార పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పై మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.


ప్రాజెక్టుల కోసం భూములను కోల్పోయిన కుడికిల్ల గ్రామ రైతులకు ఎమ్మెల్యే మోసం చేశారని ఆరోపించారు. ముందుగా డబ్బులు తీసుకున్న రైతులకు తక్కువ నష్టపరిహారం ఇచ్చి, కొంతమందికి మాత్రమే ఎక్కువ ఇప్పించారని జూపల్లి ఆరోపించారు. ఇదెక్కడి దుర్మార్గం రైతులు నష్టపోయారు అన్న విషయం మీకు తెలియనిది కాదని జూపల్లి పేర్కొన్నారు. సింగోటం బ్రిడ్జికి పెండింగ్లో ఉన్న ఐదు లక్షల రూపాయల బిల్లుకు ఎమ్మెల్యే ఏకంగా 24 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. రైతులకు ఒక న్యాయం.. ఎమ్మెల్యే కు ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు.


ఎన్నడూ లేనివిధంగా ప్రతి గ్రామానికి తన హయాంలోనే రోడ్లు వేయడం జరిగిందన్నారు. పెంట్లవెల్లి- మల్లేశ్వరం బ్రిడ్జిని మంజూరు అడగానే చేయించానని.. ఆ బ్రిడ్జి పనులను ఇప్పటివరకు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, అవసరమైతే రోడ్లపై బైఠాయించి.. జైలుకైనా వెళతానని జూపల్లి నాయకులు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story