జూన్ 21 'నీట్' రీ-టెస్ట్ 100% పక్కా: కేంద్ర విద్యాశాఖ మంత్రి

by Malleboina Mahesh |

జూన్ 21న జరిగే నీట్-యూజీ పునఃపరీక్షను 100% లోపాలు లేకుండా నిర్వహిస్తామని, పరీక్షల మాఫియాను వదిలేది లేదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తేల్చిచెప్పారు.

జూన్ 21 నీట్ రీ-టెస్ట్ 100% పక్కా: కేంద్ర విద్యాశాఖ మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఈ నెల 3న జరిగిన నీట్-యూజీ (NEET-UG 2026) వైద్య ప్రవేశ పరీక్షలో పేపర్ లీక్ అక్రమాలు (Paper leak irregularities) వెలుగుచూడటంతో ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం (Central Govt) రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే రద్దు చేసిన ఆ పరీక్షను వచ్చే జూన్ 21న నిర్వహించనున్నారు. ఈ రీ-టెస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన 'జాగ్రన్ భారత్ ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్ 2026' సదస్సులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Union Education Minister Dharmendra Pradhan) మాట్లాడుతూ.. జూన్ 21న జరగబోయే నీట్ పునఃపరీక్షను 100 శాతం పక్కాగా, ఎలాంటి లోపాలు లేకుండా (100% error-free) నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

"పరీక్షల మాఫియా" కుట్రల వల్ల ఒక్క అర్హుడైన విద్యార్థి కూడా తన సీటును కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదం కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు (Mental Anguish) గురయ్యారని, దానికి పూర్తి బాధ్యత వహిస్తూ వ్యవస్థలోని లోపాలను శాశ్వతంగా సరిదిద్దడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అంగీకరించారు. ప్రస్తుతం ఈ లీకేజీ ఉదంతంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ముమ్మర దర్యాప్తు జరుపుతోందని, ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేశారని గుర్తుచేశారు. ఈ ఎదురైన సవాళ్లు, విమర్శల నుంచి తప్పుకోకుండా విద్యా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడమే తమ ప్రథమ కర్తవ్యమని, అందుకే వచ్చే నెలలో జరిగే రీ-టెస్ట్‌ను కన్సల్టెన్సీలు, భద్రతా సంస్థల సమన్వయంతో అత్యంత సురక్షితమైన వాతావరణంలో నిర్వహిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ భరోసా ఇచ్చారు.

Next Story