NCERT, ఢిల్లీ పోలీసుల జాయింట్ ఆపరేషన్.. పాఠ్యపుస్తకాల పైరసీ గుట్టురట్టు

by Kema Shiva Kumar |

దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు ప్రామాణికమైన NCERT పాఠ్యపుస్తకాల పేరుతో సాగుతున్న భారీ పైరసీ దందాను ఢిల్లీ పోలీసులు, NCERT అధికారులు సంయుక్తంగా ఛేదించారు.

NCERT, ఢిల్లీ పోలీసుల జాయింట్ ఆపరేషన్.. పాఠ్యపుస్తకాల పైరసీ గుట్టురట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు ప్రామాణికమైన NCERT పాఠ్యపుస్తకాల పేరుతో సాగుతున్న భారీ పైరసీ దందాను ఢిల్లీ పోలీసులు, NCERT అధికారులు సంయుక్తంగా ఛేదించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ వేదికగా సాగుతున్న ఈ నకిలీ పుస్తకాల ముద్రణా కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. గత కొంతకాలంగా మార్కెట్‌లో నకిలీ NCERT పుస్తకాలు చలామణి అవుతున్నట్లుగా అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం, NCERT నిఘా విభాగం కలిసి ఘజియాబాద్‌లోని ఒక ప్రింటింగ్ ప్రెస్‌పై ఆకస్మిక దాడి నిర్వహించాయి. రెయిడ్స్‌లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వివిధ సబ్జెక్టులకు చెందిన నకిలీ పుస్తకాలు బయటపడ్డియి. భారీ ఎత్తున పుస్తకాలను ముద్రించే అత్యాధునిక మెషీన్లు ఉన్నట్లుగా గుర్తించారు. NCERT వాటర్‌మార్క్‌ను పోలి ఉండే విధంగా తయారు చేసిన భారీ పేపర్ రోల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

BNS చట్టం కింద కేసు నమోదు..

ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించి ప్రింటింగ్ ప్రెస్ యజమానులు, పంపిణీదారులపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. కొత్తగా అమలుల్లోకి భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలతో పాటు, కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక నకిలీ పుస్తకాల వల్ల విద్యార్థులు తప్పుడు సమాచారాన్ని చదివే ప్రమాదం ఉందని NCERT హెచ్చరించింది. అసలైన పుస్తకాల్లో ప్రతి పేజీపై స్పష్టమైన NCERT వాటర్‌మార్క్ ఉంటుందని, నకిలీ పుస్తకాల్లో పేపర్ నాణ్యత తక్కువగా ఉండటమే కాకుండా, అక్షరాల ముద్రణ అస్పష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. పుస్తకాలు కొనుగోలు చేయదలచిన వారు అధికారిక వెబ్‌సైట్ (ncert.nic.in) ద్వారా లేదా గుర్తింపు పొందిన పుస్తక విక్రేతల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని NCERT అధికారులు సూచించారు. ఇక ఈ పైరసీ నెట్‌వర్క్‌తో లింక్ ఉన్న ఇతర ప్రాంతాల పంపిణీదారుల కోసం పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Next Story