RSS ఎజెండాను మరింత ముందుకు.. కర్ణాటక హైకోర్టు తీర్పుతో స్పష్టం

by Disha Web Desk 2 |
RSS ఎజెండాను మరింత ముందుకు.. కర్ణాటక హైకోర్టు తీర్పుతో స్పష్టం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలు, బాలికలకు విద్యను దూరం చేయడానికి హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ వచ్చిన తీర్పు ఉపయోగపడుతుందని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం భేటీ బచావో - భేటీ పడావో నినాదం మాత్రమేనని, కళాశాలలో హిజాబ్ నిషేధ ప్రభుత్వ ఉత్తర్వు రుజువు చేస్తుందని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళుతున్నారని, ముస్లిం మహిళల గుర్తింపును, వారి దుస్తులను, వారి జీవితాలను రాజ్యం ఆజ్ఞపిస్తూ అదుపాజ్ఞలలో ఉంచుతుందని, ఇది పితృస్వామ్య, మతపరమైన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న పోరాటాలను దెబ్బతీస్తుందన్నారు.

మహిళల హక్కులను మరింత అగౌరవ పర్చడానికి, అడ్డుకోవడానికి ఉపయోగించబడుతుందన్నారు. చివరికి, ముస్లిం బాలికలు, మహిళలను ఛాందసవాద శక్తుల చేతుల్లోకి నెట్టడానికి ఈ తీర్పు తోడ్పడుతుందన్నారు. వివిధ సంస్థల ద్వారా పితృస్వామ్యం ఎలా కొనసాగుతుందో, పోషించబడుతుందో ఈ తీర్పు స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. దేశంలోని మహిళలు ఈ నిషేధాన్ని, ఈ తీర్పును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. చదువు, ఉద్యోగాలు, బట్టలు, పెళ్లి వంటి వాటి గురించి స్త్రీలే నిర్ణయించుకోకూడదని కొన్ని శక్తులు అనుకుంటున్నాయని తెలిపారు.

సుప్రీంకోర్టు వెంటనే ఈ సమస్యను పరిశీలించాలని, ఈ మహిళా వ్యతిరేక తీర్పును పక్కన పెట్టాలని కోరారు. ఇటువంటి ఆదేశాల ద్వారా స్త్రీలను నాలుగు గోడల మధ్య వెనక్కు నెట్టివేస్తున్న మనువాద శక్తులకు వ్యతిరేకంగా విస్తృత దృఢమైన పోరాటాన్ని నిర్మించాలని మహిళలకు పిలుపునిచ్చారు. మహిళలు తమ ప్రజాస్వామిక సమస్యలపై, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్మించాలన్నారు. ముస్లిం మహిళలకు హిజాబ్ ధరించడం లేదా ధరించకపోవడం అనే హక్కుకు సంఘీభావంగా నిలవాలని, మనువాద శక్తులు విధానపరమైన నిర్ణయాలను ప్రభావితం చేయడం, నియంత్రించడం వల్ల తీవ్రమైన దాడికి గురవుతున్న హక్కులను రక్షించుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed