Jana Nayagan : ‘జన నాయగన్‌’ చిత్ర బృందం కీలక నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-12 07:08:44  IST  )

తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) సెన్సార్ వివాదం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Jana Nayagan : ‘జన నాయగన్‌’ చిత్ర బృందం కీలక నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) సెన్సార్ వివాదం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మూవీ విడుదలపై తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే విధించడాన్ని సవాలు చేస్తూ చిత్ర బృందం తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. కేసులో తదుపరి విచారణ జనవరి 21 వరకు వాయిదా పడిన నేపథ్యంలో అప్పటి వరకు ఆగితే సక్రాంతి సీజన్ అయిపోతుందని, ఫలితంగా నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, తాము దాఖలు చేసిన పిటిషన్‌‌పై ఇవాళ అత్యవసరంగా విచారించాలని ‘జన నాయగన్’ నిర్మాతలు కోర్టుకు విన్నవించారు. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే మూవీ భవితవ్యం ఆధారపడి ఉంది.

కాగా, ‘జన నాయగన్’ మూవీలో కొన్ని సీన్లు, డైలాగ్స్‌పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ముఖ్యంగా సాయుధ దళాల (Armed Forces) చిత్రణ, కొన్ని మతపరమైన అంశాలపై బోర్డు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే మూవీలో కొన్ని సీన్లు కట్ చేయగా మొదట సీబీఎఫ్‌సీ యూ/ఏ (U/A) సర్టిఫికేట్‌కు సిఫార్సు చేసినప్పటికీ, ఆ తర్వాత ఆకస్మికంగా సినిమాను రివైజింగ్ కమిటీకి మళ్లిస్తున్నట్లు సెన్సార్ బోర్డు ప్రకటించింది. దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. దీంతో సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ నిర్మాణ సంస్థ (KVN ప్రొడక్షన్స్) మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన జస్టిస్ పీటీ ఆశా (PT Asha) ‘ఒక్క సభ్యుడి ఫిర్యాదుతో సినిమాను ఆపడం సరికాదని పేర్కొంటూ, తక్షణమే యూ/ఏ (U/A 16) సర్టిఫికేట్ జారీ చేయాలని జనవరి 9న ఆదేశించారు. కానీ, సెన్సార్ బోర్డు అదే రోజు సాయంత్రం సింగిల్ బెంచ్ తీర్పును.. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ విచారణను జనవరి 21కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Next Story