ఆసక్తికరంగా రాష్ట్ర రాజకీయాలు.. ఢిల్లీకి వెళ్లిన జగ్గారెడ్డి

by Dishafeatures2 |
ఆసక్తికరంగా రాష్ట్ర రాజకీయాలు.. ఢిల్లీకి వెళ్లిన జగ్గారెడ్డి
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్​ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లారు. భార్య, పిల్లలతో సహా ఆయన ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ​రెడ్డితో ఏర్పడిన విభేదాల కారణంగా ఆయన కాంగ్రెస్ ​కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఓ సందర్భంలో పార్టీకి గుడ్ బై చెబుతానని కూడా ప్రకటించారు. కాగా పార్టీ అధిష్టానం ఇటీవల పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పదవీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరింత ఆగ్రహించిన ఆయన రేవంత్ ​రెడ్డిపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం కూడా విదితమే.

జగ్గారెడ్డి తీరును పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నదని, అతనిని పార్టీ నుంచి సస్పెండ్​చేయనున్నట్లు పార్టీ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేసుకున్నాయి. ఆయన మాత్రం అవేవి పట్టించుకోకుండా సంగారెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. ఇలా ఉండగా ఢిల్లీకి రావాలని జగ్గారెడ్డికి ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్​లు రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా ఫోన్లు చేసి పిలిచిన విషయం తెలిసిందే.

వారి ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం జగ్గారెడ్డి తన సతీమణి నిర్మల, కూతురు జయరెడ్డి, కొడుకు భరత్ ​సాయి రెడ్డిలతో కలిసి రైలులో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఆయన కాంగ్రెస్​ యువనేత రాహుల్​ గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఏ అంశాలపై చర్చ జరగనున్నది..? జగ్గారెడ్డి స్పందన ఎలా ఉండనున్నదనేది రాజకీయంగా ఆసక్తి నెలకొన్నది.

Next Story

Most Viewed