వైకుంఠానికి పోవుడంటే నరకమే..? వర్షం వస్తే వాగు పక్కనే అంత్యక్రీయలు

by Dishafeatures2 |
వైకుంఠానికి పోవుడంటే నరకమే..? వర్షం వస్తే వాగు పక్కనే అంత్యక్రీయలు
X

దిశ ,చండ్రుగొండ : పల్లె రూపురేఖలు మార్చాలనే ఆలోచనతో ప్రభుత్వం పల్లె పకృతి కార్యక్రమానికి రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాటిని గ్రామాల్లో నిర్మించి గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలనే లక్ష్యంతో రూ.లక్షలను వెచ్చించి వాటి నిర్మాణాలు చేపట్టింది. కానీ కొందరి అనాలోచిత నిర్ణయాలకు ఆ పథకం నీరుగారిపోతుంది.

చాలా గ్రామాలకు ఈ పథకం అందని ద్రాక్షగానే మిగిలింది. ఊరికి దగ్గరగా నిర్మాణం చేయాలని సర్కార్ చెబుతుంటే ఊరికి ఆమడదూరంలో నిర్మాణం చేస్తూ మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మైళ్ల దూరం మాకొద్దు అంటూ జనం మొత్తుకున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చండ్రుగొండ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఈజీఎస్ పథకం నుంచి వైకుంఠధామం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మరణించిన సమయంలో ప్రజలందరూ ఒకే వద్ద ఖననం చేసుకునేందుకు, దహన సంస్కారాలు చేసుకునేందుకు వీలుగా ఉండే విధంగా వైకుంఠదామాలను నిర్మాణం చేయాలని ప్రభుత్వం అధికారులకు, పాలకులకు సూచించింది. అందులో భాగంగానే మండలంలో చాలా గ్రామాల్లో వైకుంఠదామాలను గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించారు. కానీ గుర్రంగూడెం గ్రామ పంచాయతీలో మాత్రం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో వైకుంఠదామాన్ని నిర్మాణం చేస్తున్నారు. చాలా దూరంగా ఉండటంతో పాటు ఆ వైకుంఠదామానికి వెళ్లాలంటే వాగు దాటి పోవాల్సి ఉంటుంది. వర్షం వచ్చిన సమయంలో కచ్చితంగా నడుము లోతు నీళ్లు ఆ వాగులో ప్రవహిస్తుంటాయి.

వర్షం వస్తే గ్రామ పరిసర ప్రాంతాల్లో వైకుంఠదామాన్ని నిర్మాణం చేయాల్సిన అధికారులు, పాలకులు రెండు కిలోమీటర్ల దూరం నిర్మాణం చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఎవరు చనిపోయినా దహన సంస్కారాలు చేయాలంటే గ్రామస్తులు మృతుల బంధువులు నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తోడు అడవిలో రవాణా మార్గం లేక పోవడం, చిన్నపాటి వర్షం పడితే కాలు తీసి కాలువేసే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా వైకుంఠ ధామం చేరుకోవాలంటే మార్గమధ్యంలో ఉన్న వాగుకు ఏలాంటి చప్టా లేకపోవడంతో నడుము లోతు నీటిలో పాడే మోస్తూ వాగు దాటాల్సిందే. ఇక వర్షాకాలం అయితే గ్రామస్తులు ఇక్కడే నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటలేక వాగులు చెరువులు కుంటలు పక్కనే దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.


ప్రభుత్వం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠధామాలు నిర్మించాలని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ గ్రామానికి ఆమడదూరంలో నిర్మించడంతో గ్రామస్తులతో పాటు మృతుల బంధువులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు కలుగజేసుకుని గ్రామం నుంచి వైకుంఠధామం వరకు గ్రావెల్ రోడ్డు నిర్మించాలని అలాగే వాగుపై లో లెవెల్ వంతెన నిర్మించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. అలానే అదే దారిలో వాగు పైన సుమారు 60 నుంచి 80 ఎకరాల వ్యవసాయ భూమి కూడా రైతులు సాగు చేస్తున్నారు. గతంలో ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కలెక్టర్ సైతం కూడా వినతి పత్రాలు అందజేశారు. కానీ నేటికీ కూడా వాగుపై ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు.

అనేకమార్లు వినతులు చేసినం : కాకా సీత (సర్పంచ్)

గ్రామ పంచాయతీలో ప్రభుత్వ భూమి లేకపోవడం వల్ల అటవీశాఖ అధికారుల నుంచి వైకుంఠధామం కి జిల్లా కలెక్టర్ నుంచి స్థలం సేకరించారు.. కానీ వైకుంటదామనికి కి వెళ్లడానికి సరైన మార్గం లేదని పలుమార్లు అధికారులుకు కూడా తెలియజేశాం. కొన్నిసార్లు ప్రజాప్రతినిధులకు కూడా వినతిపత్రం అందజేశాం. కానీ అధికారులు ఇంతవరకు కూడా స్పందించలేదు.. అదేవిధంగా వ్యవసాయం చేసుకునే రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఇదే దారి గుండా వెళ్లాలి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మాకు వాగుపై బ్రిడ్జి నిర్మాణం, అదేవిధంగా వైకుంఠధామానికి మెటల్ రోడ్డు వేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అన్నారు.

వైకుంఠధామానికి వెళ్లడానికి నరకం చూస్తున్నాం: శీలం శ్రీనివాస్ రెడ్డి (రైతు)

మా గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన వైకుంఠధామానికి వెళ్లడానికి నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఆ దారిలో కాలు తీసి కాలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. అదేవిధంగా ఆ వాగులో ఎప్పుడూ కూడా సుమారు 5 నుంచి 6 అడుగులు నీరు ఎప్పుడూ పారూతు ఉంటది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణం నిర్మించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed