అది ఎంతో భయంకరమైన పరిస్థితి.. భయానక అనుభవాలను పంచుకున్న పీవీ సింధు

by Malleboina Mahesh |

యుద్ధం వల్ల దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు. భారీ పేలుళ్లు, పొగ మధ్య గడిపిన భయానక అనుభవాలను వివరిస్తూ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అది ఎంతో భయంకరమైన పరిస్థితి.. భయానక అనుభవాలను పంచుకున్న పీవీ సింధు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పీవీ సింధు (PV Sindhu) దుబాయ్ లో చిక్కుకుపోయిన వారిలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఉన్నారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్తుండగా, దుబాయ్‌లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో సింధు, ఆమె సహాయక సిబ్బంది అక్కడే ఉండిపోయారు. అనంతరం ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్న ఆమె.. తాను దుబాయ్‌లో చిక్కుకుపోయిన భయానక పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో సింధు మాట్లాడుతూ.. బర్మింగ్‌హామ్‌లో జరగనున్న టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో, దుబాయ్‌లో విమానం ల్యాండ్ అయిన కేవలం 15 నిమిషాలకే అక్కడి విమానాశ్రయాన్ని మూసివేసినట్లు ఆమె తెలిపారు. మొదట పరిస్థితి అర్థం కాకపోయినా, రోజులు గడిచేకొద్దీ ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని ఆమె పేర్కొన్నారు.

తన కోచ్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సమయంలో భారీ శబ్దాలు వినబడ్డాయని, పెద్ద ఎత్తున పొగ రావడం చూశారని సింధు గుర్తు చేసుకున్నారు. హోటల్‌లో ఉన్న సమయంలో కూడా మరుసటి రోజు పేలుడు శబ్దాలు వినిపించాయని, ఆ పరిస్థితులు ఎంతో భీతిగొలిపాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ కష్టకాలంలో దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్, భారత ప్రభుత్వం అద్భుతంగా సమన్వయం చేసుకుని తమకు అండగా నిలిచారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వందలాది మంది ప్రయాణికులకు వసతి కల్పించి, ప్రత్యేక విమానాల ద్వారా తనను సురక్షితంగా భారత్‌కు చేర్చడంలో ప్రభుత్వం చూపిన చొరవను ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.

Next Story