ఇస్లామాబాద్ శాంతి చర్చల్లో ఊహించని మలుపు.. జె.డి. వాన్స్ సంచలన ప్రకటన

by Malleboina Mahesh |

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం! షరతులకు ఇరాన్ ఒప్పుకోలేదని, చర్చల నుండి వెనుదిరుగుతున్నామని జె.డి. వాన్స్ సంచలన ప్రకటన.

ఇస్లామాబాద్ శాంతి చర్చల్లో ఊహించని మలుపు.. జె.డి. వాన్స్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా పశ్చిమాసియా యుద్ధం (West Asia War) వల్ల యావత్ ప్రపంచం సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో శాంతిని నెలకొల్పడం లక్ష్యంగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్‌లో చారిత్రాత్మక శాంతి చర్చలు (Peace talks) ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం లో జరిగిన ఈ తొలి రౌండ్ సమావేశంలో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనగా.. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్ ప్రాతినిధ్యం వహించారు. తొలుత ఈ సమావేశం ప్రశాంతంగా ముగిసిందని, ఇరు దేశాల మధ్య దౌత్య మార్గాన్ని సుగమం చేసేందుకు పాక్ ప్రధాని చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని వార్తలు వెలువడ్డాయి.

జె.డి. వాన్స్ సంచలన ప్రకటన

అయితే చర్చలు ముగిసిన కొద్దిసేపటికే అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ (US Vice President J.D. Vance) చేసిన ప్రకటనతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని, ఇరాన్ వైఖరి కారణంగా శాంతి చర్చలు విఫలమైనట్లు (Peace talks fail) ఆయన ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక దురదృష్టకరమైన వార్త.. ఇరాన్ తో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఎలాంటి ఒప్పందం, అంగీకారం జరగలేదు. మా షరతులకు ఇరాన్ అంగీకరించలేదు. చర్చల నుండి మేము వెనుదిరుగుతున్నాం అని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ప్రకటించారు.

Next Story