ఆ పథకం ధనవంతులకేనా..‌? మరి అర్హుల పరిస్థితి ఏంటి..?

by Dishafeatures2 |
ఆ పథకం ధనవంతులకేనా..‌? మరి అర్హుల పరిస్థితి ఏంటి..?
X

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన దళిత బంధు పథకం ప్రారంభంలోనే అపవాదును మూటగట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని ప్రారంభించి.. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 మంది దళిత కుటుంబాలను ఎంపిక చేసి, వారికి ప్రభుత్వం ద్వారా 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలనుకుంది. అంతేకాదు ఈ నిధులతో వివిధ రకాల యూనిట్లు కొనుగోలు చేసి.. వ్యాపారం నిర్వహించేందుకు ఆర్థికంగా సహాయం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ దళిత బంధు పథకం కొందరు ధనవంతులకు, ప్రజాప్రతినిధులకు వరంగా.. అర్హులైన దళితులకు శాపంగా మారిందని చెప్పవచ్చు.

వైరా నియోజకవర్గంలోని ఐదు మండలాలైన వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి.. ఒక్కో మండలానికి 20 మంది చొప్పున మొత్తం వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకు అప్పగించారు. అయితే జనాభా ప్రాతిపదికన కొన్ని మండలాలకు 20 మంది కంటే ఎక్కువగా, మరికొన్ని మండలాలలో తక్కువగా లబ్ధిదారులను ఎంపిక చేసి మొత్తం ఐదు మండలాల నుండి వంద మంది అర్హుల జాబితాలను ఉన్నతాధికారులకు పంపించారు. అయితే దళిత బంధు పథకానికి అర్హులైన దళితుల నుండి దరఖాస్తులు ప్రతి మండలం, ప్రతి గ్రామం నుండి స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్‌కు అందించారు.


దరఖాస్తులు ఇచ్చిన అర్హులు తమకే దళిత బంధు పథకం వస్తుందనే ఆశతో ఎదురు చూశారు. కానీ వారి ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. ఆయా తమ గ్రామాల్లో అర్హులకు కాకుండా అనర్హులకు పెద్దపీట వేస్తున్నారని, వారిలే దళిత బంధు పథకానికి లబ్ధిదారులుగా ప్రకటిస్తున్నారని పేద దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రోడ్లుపై ధర్నాలు, రాస్తారోకోలు, స్థానిక ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేసిన సందర్భాలు లేకపోలేదు. మండలాల వారీగా మొదటి విడత వంద మంది లబ్ధిదారుల అర్హుల జాబితాను ప్రకటించడంతో ఆశ్చర్యం గొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

అన్ని మండలాల్లో కూడా అర్హుల జాబితాలో అత్యధిక శాతం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ధనవంతులకు చోటు కల్పించడంతో అర్హులైన వారిని కాకుండా అనర్హులకు పెద్దపీట వేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. వైరా మండలంలో 28 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా.. అందులో ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల పేర్లు, ధనవంతుల పేర్లు ప్రకటించడంతో అర్హులైన నిరుపేద దళితుల నుండి గ్రామాల్లో వ్యతిరేకత మొదలైంది అని చెప్పవచ్చు. అసలు దళిత బంధు పథకానికి అర్హులుగా ఏ ప్రాతిపదికపైన వీరిని ఎంపిక చేశారో, అర్హులకు మొండిచెయ్యి చూపి అనర్హులకు పెద్దపీట వేయటం వెనుక ఆంతర్యం ఏమిటో అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఎన్నికల కోసం వేసే ఎత్తులు ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టే విధంగా ఉన్నాయని అంటున్నారు. కొన్ని మండలాల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ కు వ్యతిరేకంగా గతంలో మాజీ ఎమ్మెల్యేతో పనిచేసిన కొందరు నాయకులకు, ప్రజా ప్రతినిధులకు దళిత బంధు ఎరవేసి రాజకీయంగా లబ్ధి పొందాలని వేసిన ఎత్తులు ఫలిస్తాయో లేదో ఏమో కానీ గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగి రానున్న ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed