మధ్యంతరంగా ఆపేసిన కేఎల్ఐ కాల్వ నీటి సరఫరా.. దిక్కుతోచని స్థితిలో రైతులు

by Disha Web |
మధ్యంతరంగా ఆపేసిన కేఎల్ఐ కాల్వ నీటి సరఫరా.. దిక్కుతోచని స్థితిలో రైతులు
X

దిశ, జడ్చర్ల (మిడ్జిల్ ) : నీటిపారుదల శాఖ అధికారుల ముందస్తు సమాచారం లేకుండా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వల ద్వారా నీటి సరఫరాను నిలిపేయడంతో పంటలు ఎండిపోయాయని మిడ్జిల్ మండల రైతులు వాపోతున్నారు. పంటలు చేతికందే దశలో ఆయకట్టుకు నీటి సరఫరా ఆగడంతో రైతన్నల పంట ఎండి అపార నష్టం వాటిల్లిందని ఆందోళనకు గురవుతున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్(కేఎల్‌ఐ) కెనాల్‌ నుంచి 2.34లక్షల ఎకరాలకు నీరందించేందుకు అధికారులు ప్రణాళికను రూపొందించారు.

ఈ సీజన్‌లో వర్షాలు బాగా రావడంతో సాగు నీటికి ఢోకా ఉండదనే భావనతో రైతులు కాలువ నీటిని నమ్ముకొని వేరుశనగ, మినుములు, ఆముదం, మొక్కజొన్న పంటలతో పాటు వరి సాగు వేశారు. పంటలు చేతికొచ్చే కీలకమైన దశలో ఫిబ్రవరి 9వ తేదీ నుండి లిఫ్టింగ్‌ పంపింగ్‌ను ఆపేయడంతో కాల్వల ద్వారా నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలోని చిల్వేర్, వెలుగొమ్ముల, అయ్యవారిపల్లి, రాణి పేట, మున్ననూర్, వాడియల్, మిడ్జిల్ మల్లాపూర్ గ్రామాల్లో వందల ఎకరాల పంటలు ఎండిపోయాయి. వరికి నీటి సరఫరా లేక పొలాలు నెర్రెలిచ్చాయి.



మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన రైతు పండుగ గోపాల్ రెడ్డి ఆరు ఎకరాల్లో రూ.లక్షా ఇరవై వేల పెట్టుబడితో వరి సాగు చేశారు. కాల్వ నీటి మధ్యంతరంగా ఆగిపోవడంతో పంటలను కాపాడుకునేందుకు తన వ్యవసాయ పొలంలో రెండు లక్షల వ్యయంతో ఏడు బోర్లు వేయగా చుక్క నీరు రాకపోగా మరింత భారం పెరిగింది. దీంతో తన ఆరు ఎకరాల వరి చేను గొర్లు మేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. గత సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ వరకు కాలువ ద్వారా నీటిని సరఫరా చేశారని, ఈ సంవత్సరం కూడా అదే మాదిరి నీటి సరఫరా ఉంటుందని నమ్మకంతో రైతులు పంటలు సాగు చేశారు.

కానీ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కాల్వ నీటి సరఫరాను మధ్యంతరంగా ఆపేయడంతో పంటను కాపాడుకునే మార్గం లేకుండా పోయిందని బాధపడుతున్నారు. కాల్వ నీటిని నమ్ముకొని పంటలు సాగు చేసిన రైతులకు పెట్టుబడి మీద పడి అప్పుల ఊబిలో కూరుకుపోయి పెనుభారంగా మారింది. నీరు లేక ఎండిన పంటలను పశువులు మేపడం తప్ప ఏం ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ద్వారా రైతుల పంటలు ఎండిపోయి అపార నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తక్షణమే ఎండిన పంటలను నమోదు చేసుకునేందుకు అధికారులను పంపించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని మిడ్జిల్ మండలంలోని రైతులు వేడుకుంటున్నారు.



రైతు బంధు డబ్బులు వృధా అయినట్లే..?

తెలంగాణ ప్రభుత్వం రైతుల పంటల పెట్టుబడి కోసం ఇచ్చిన రైతు బంధు డబ్బులు నీటిపారుదల శాఖ అధికారుల అనాలోచిత నిర్ణయంతో నీటి సరఫరా నిలిపివేయడంతో పంటలు ఎండి ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు డబ్బులు మొత్తం కంటే అధికంగానే రైతులు నష్టపోయినట్లు తెలుపుతున్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలి రైతులు కోరుకుంటున్నారు.

వడ్లు కోనం అన్నారు కానీ నీరు వదలం అనలేదు..

ప్రభుత్వ పాలకులు అధికారులు వడ్లు కోనం అన్నారు.. కానీ నీటి సరఫరాను నిలిపివేస్తామని చెప్పలేదని అలా ముందస్తుగానే చెప్పి ఉంటే రైతులు కాలువ నీటిపై ఆధారపడి పంటలు వేసేవారు కాదని ఇలా నష్టపోయే వారు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed