- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీలు వాడకండి.. ప్రజలకు ఇరాన్ విజ్ఞప్తి
పశ్చిమాసియా (Middle East) లో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా (Middle East) లో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గత నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం (MoU) పూర్తిగా రద్దయ్యాక, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మునుపెన్నడూ లేని విధంగా పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో, తమ దేశానికి చెందిన కీలకమైన విద్యుత్ మౌలిక సదుపాయాలపై (Power Infrastructure) అమెరికా దళాలు వైమానిక దాడులు జరిపినట్లు ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. ఇటీవలి ఘర్షణల తర్వాత తమ ఎనర్జీ గ్రిడ్లపై అమెరికా దాడులు చేసిందని ఇరాన్ అంగీకరించడం ఇదే తొలిసారి.
ఏసీలు వాడకండి
ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో ఇరాన్ విద్యుత్ మంత్రిత్వ శాఖ తమ దేశ పౌరులకు కీలక విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా తీవ్రమైన దాడులు జరుగుతున్న దక్షిణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఆయా ప్రాంతాలలో ప్రస్తుతం వేసవి తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయని, దానికి తోడు విద్యుత్ ప్లాంట్లు, గ్రిడ్లపై దాడులు జరుగుతున్నందున విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందువల్ల అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా సాగాలంటే ప్రజలు వీలైనంత తక్కువగా విద్యుత్ను వినియోగించాలని (Power Conservation) కోరింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వాడకం తగ్గించాలని విజ్ఞప్తి చేసింది.
హర్మూజ్ జలసంధిపై పట్టు కోసం తీవ్ర పోరు
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై (Strait of Hormuz) నియంత్రణ సాధించేందుకు అమెరికా, ఇరాన్ దేశాలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. వాణిజ్య నౌకల రాకపోకలను అడ్డుకుంటే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే తీవ్రంగా హెచ్చరించారు. ఈ హెచ్చరికలను నిజం చేస్తూ, యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆధ్వర్యంలో అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు మరియు యుద్ధనౌకలు ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాలపై వరుసగా ఆరో రాత్రి కూడా భారీ దాడులు నిర్వహించాయి.
హార్మూజ్ క్లోజ్
ఈ దాడుల్లో బందర్ అబ్బాస్, చాబహార్, ఖమీర్ కౌంటీలలోని కీలకమైన సముద్ర నిఘా కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలతో పాటు సరఫరా లైన్లను కట్ చేయడానికి వీలుగా ఉన్న కనీసం 6 వ్యూహాత్మక వంతెనలను (Bridges) అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. ఈ భీకర దాడుల కారణంగా హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపుగా స్తంభించిపోయాయి. సాధారణ రోజుల్లో నిత్యం 130 కి పైగా నౌకలు ప్రయాణించే ఈ జలసంధిలో, గత 24 గంటల్లో కేవలం 3 నుండి 5 నౌకలు మాత్రమే దాటాయంటే అక్కడి యుద్ధ వాతావరణం ఎంత భీతిని గొల్పుతుందో అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు, ఇరాన్ సైనిక కమాండ్ (Khatam al-Anbiya) కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. అమెరికా గనుక తమ దేశ సివిలియన్, పవర్ ప్లాంట్లపై దాడులను ఇలాగే కొనసాగిస్తే.. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలున్న కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి ప్రాంతాల మౌలిక సదుపాయాలపై తాము క్షిపణులతో భీకర ప్రతిదాడి చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయి యుద్ధంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి.






