బీజేపీ నేత పిటిషన్‌‌పై సుప్రీం కోర్టు షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 13 |
బీజేపీ నేత పిటిషన్‌‌పై సుప్రీం కోర్టు షాకింగ్ కామెంట్స్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాను రెండు జిల్లాలుగా విభజించిన సంగతి విదితమే. అయితే తిరుచానూరు పద్మావతి కాంప్లెక్స్‌ను బాలాజీ జిల్లా కలెక్టరేట్‌గా మార్చడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బీజేపీ నేత జి భానుప్రకాశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


తిరుచానూరు పద్మావతి కాంప్లెక్స్‌ను బాలాజీ జిల్లా కలెక్టరేట్‌గా తీసుకోవడంపై స్టే విధించాలని భాను ప్రకాష్‌రెడ్డి పిటిషన్‌లో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. అనంతరం తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

కలెక్టరేట్ రావడంతో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది..

తిరుచానూరు పద్మావతి కాంప్లెక్స్‌ను బాలాజీ జిల్లా కలెక్టరేట్‌గా ప్రభుత్వం తీసుకోవడాన్ని దేశ అత్యున్నత ధర్మాసనం సమర్థించింది. భాను ప్రకాశ్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌పై ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కలెక్టరేట్‌ కార్యాలయం రావడంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది. కలెక్టర్ చెట్టు కింద కూర్చుని పనిచేయలేరు కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి సముచిత గౌరవం ఇవ్వాలని సూచించింది. జిల్లాల పునర్విభజన చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Next Story