తొలి పోస్టాఫీస్ కేఫ్! దేశంలో మొదటిసారి ప్రారంభం

by Dishafeatures2 |
తొలి పోస్టాఫీస్ కేఫ్! దేశంలో మొదటిసారి ప్రారంభం
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు కస్టమర్ల హడావిడితో సందడిగా కనిపించే 'పోస్టాఫీస్'లు ఒక దశలో కళ తప్పాయి. కానీ ఇప్పుడు జనరేషన్‌కు అనుగుణంగా అప్‌డేట్ అవుతుండటంతో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఇక యువతరానికి కూడా చేరువయ్యే క్రమంలో ఇటీవలే కోల్‌కతాలోని చారిత్రాత్మక జనరల్ పోస్ట్ ఆఫీస్ భవనంలో 'సియులీ' కేఫ్ ప్రారంభమైంది. భారతదేశంలో మొట్టమొదటి పోస్టాఫీస్ కేఫ్‌ ఇదే కాగా.. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

'ప్రస్తుత తరంతో మా సంబంధాలను బలోపేతం చేయాలనే ఆలోచనతో ఈ కేఫ్ ప్రారంభించాం. పార్శిల్-బుకింగ్, ప్యాకేజింగ్, గిఫ్ట్-ప్యాకింగ్ కోసం ఎంచుకున్న ప్రదేశంలోనే ఒక కేఫ్‌ ఉండటం వల్ల యువత ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. మా వద్ద ఫిలాట్లీ(స్టాంపుల సేకరణ) ఆల్బమ్స్ నుంచి వెండి ట్రింకెట్స్ వరకు అన్నీ ఉన్నాయి. గంగోత్రి నుంచి ప్యాక్ చేసిన గంగా నీటిని కూడా ఇక్కడ విక్రయిస్తాం. ప్రస్తుతం అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ వృద్ధి, ఈ-కామర్స్ కారణంగా పార్శిల్, లాజిస్టిక్స్ రంగంలో భారీ పురోగమనానికి దారితీసింది. ఇండియా పోస్ట్ మార్కెట్‌లోనే కాకుండా ప్రజల ఆలోచనల్లోనూ పట్టును కొనసాగించాలంటే ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచనల నుంచి ఉద్భవించిందే ఈ కేఫ్. దేశవ్యాప్తంగా ఇలాంటి కేఫ్స్ వచ్చేందుకు ఇదొక రోడ్‌మ్యాప్ లాంటిది' అని కోల్‌కతా రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ నీరజ్ కుమార్ తెలిపారు.

'ఒక పార్శిల్‌ను బుక్ చేసిన తర్వాత పెద్ద పెద్ద షాండ్లియర్లు, రంగురంగుల ఇంటీరియర్స్‌తో కూడిన కేఫ్‌లో కాసేపు కూర్చుని టీ తాగడం వల్ల కాస్త రిలాక్స్ కావచ్చు. ఇంతకు మించి ఎవరైనా ఏమి అడగాలి. నేనైతే హ్యాపీగా డార్జిలింగ్ టీ తాగుతూ ఎంజాయ్ చేశాను' అని టీచర్ శ్రేయా ఛటర్జీ అన్నారు.

Next Story