భారత కంప్యూటర్ మార్కెట్‌కు మరోసారి కరోనా కష్టాలు!

by Disha Web Desk 17 |
భారత కంప్యూటర్ మార్కెట్‌కు మరోసారి కరోనా కష్టాలు!
X

న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే సాధారణ అమ్మకాలను సాధిస్తున్న భారత పర్సనల్ కంప్యూటర్(పీసీ) మార్కెట్‌కు మరోసారి కష్టాలు తప్పవని తెలుస్తోంది. చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా నేపథ్యంలో అక్కడ దేశవ్యాప్తంగా ప్రధాన తయారీ కేంద్రాలున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల పీసీ మార్కెట్లో సరఫరా అంతరాయాలు ఏర్పడ్డాయి. దీనివల్ల భారత పీసీ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొనక తప్పదని మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిస్ వెల్లడించింది. 2021లో భారత పీసీ మార్కెట్ మొత్తం 45 శాతం వృద్ధిని నమోదు చేసింది. డెస్క్‌టాప్, నోట్‌బుక్, ట్యాబ్లెట్‌లు మొత్తం 1.86 కోట్ల పరికరాలు మార్కెట్లోకి సరఫరా అయ్యాయి. గతేడాది ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదైనప్పటికీ ఈ ఏడాదిలో అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడంలేదని కెనాలిస్ అభిప్రాయపడింది.

ముఖ్యంగా వినియోగదారులకు నోట్‌బుక్‌లు, ట్యాబ్లెట్ కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచ సరఫరాల్లో అవాంతరాల వల్ల దేశీయంగా ఇబ్బందులు ఉండొచ్చని రీసెర్చ్ అనలిస్ట్ జష్ షా అన్నారు. గత ఏడాది చివరి త్రైమాసికంలో మొత్తం పీసీల సరఫరా 53 లక్షల యూనిట్లతో 46 శాతం వృద్ధి నమోదైంది. నోట్‌బుక్‌లు 40 శాతం పెరిగి 33 లక్షలు, డెస్క్‌టాప్ 70 శాతం వృద్ధితో గత ఎనిమిది త్రైమాసికాల్లోనే మొదటిసారిగా 7 లక్షల యూనిట్లను అధిగమించాయి. వీటిలో ఎక్కువ భాగం లెనొవా, శాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీ స్థానికంగా తయారు చేయడం ద్వారా అమ్మకాల సామర్థ్యాన్ని సాధించాయని నివేదిక వెల్లడించింది.


Next Story

Most Viewed