సెబీ వద్దకు చేరిన ఎల్ఐసీ ఐపీఓ!

by Web Desk |
సెబీ వద్దకు చేరిన ఎల్ఐసీ ఐపీఓ!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఐపీఓ ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఎల్ఐసీ సంస్థ ఆదివారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్(డీఆర్‌హెచ్‌పీ)ని ఫైల్ చేసింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఈ ఐపీఓ మార్చిలో ఉండనుంది. ఆదివారం దాఖలైన డీఆర్‌హెచ్‌పీలో ఎల్ఐసీ మొత్తం 31.62 కోట్లకు పైగా షేర్లను విక్రయానికి పెట్టింది. అలాగే, 2021 నాటికి ఎల్ఐసీ తన నిర్వహణలో ఉన్న ఆస్తులు మొత్తం రూ. 39.6 లక్షల కోట్లుగా పేర్కొంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) కార్యదర్శి తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ.. 'ఈ ఐపీఓ 100 శాతం ప్రభుత్వం నుంచి ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నిర్వహించబడుతుంది. ఎల్ఐసీ నుంచి ఎలాంటి కొత్త షేర్లు జారీ చేయబడవు. విలువ పరంగా 5 శాతం ఈక్విటీకి సమానమైన మొత్తం 31.6 కోట్ల షేర్లను ఐపీఓలో ఉంచుతున్నట్టు' చెప్పారు. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం.. 2021, మార్చి 31 నాటికి ఎల్ఐసీ సంస్థ 28.3 కోట్ల పాలసీలు, 13.5 లక్షల మంది ఏజెంట్లతో కొత్త వ్యాపార ప్రీమియంలలో 66 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2021, సెప్టెంబర్ 30 నాటికి ఎల్ఐసీ నికర ఆస్తుల విలువ రూ. 5,39,686 కోట్లుగా ఉంది. కాగా, మార్చి నాటికి ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఐపీఓలో కొంత భాగం యాంకర్ ఇన్వెస్టర్లకు, సంస్థ ఐపీఓ పరిమాణంలో 10 శాతం పాలసీదారులకు రిజర్వ్ చేయబడింది.

Next Story