కేసీఆర్‌పై నమ్మకంలేక.. ఆ పుస్తకాలను కొనేవారే లేరు..

by Dishanational2 |
కేసీఆర్‌పై నమ్మకంలేక.. ఆ పుస్తకాలను కొనేవారే లేరు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్​అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ ఖాళీలు 80,039 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్​ఇస్తానని ప్రకటించారు. ఆ ప్రకటన అనంతరం నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించినా స్టడీ మెటీరియల్​కొనేందుకు ఏ మాత్రం మొగ్గు చూపడంలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్​గతంలోనూ త్వరలో నోటిఫికేషన్​అంటూ ఊదరించడమే దీనికి కారణంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు కేసీఆర్​మాటలు నమ్మి పుస్తకాలు కొని ఆర్థికంగా నష్టపోయినట్లుగా యువత వాపోతున్నారు. యువత కొనేందుకు ముందుకు రాకపోవడంతో వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి త్వరలో నోటిఫికేషన్​అని చెప్పడంతో కొంత స్టాక్​ను కూడా తెప్పించుకున్న వ్యాపారులు.., నిరుద్యోగులు స్టడీ మెటీరియల్ ను కొనుగోలు చేయకపోవడంతో ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగట్లేదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు.

నోటిఫికేషన్​అనగానే గ్రామాల నుంచి చాలా మంది యువత పట్టణానికి చేరుకున్నారు. నోటిఫికేషన్​ఎప్పుడొచ్చినా ముందస్తుగానే సిద్ధంగా ఉండాలని రెడీ అయినా స్టడీ మెటీరియళ్ల కొనుగోలుకు ఆసక్తి కనబరచడంలేదు. గతంలో తమ వద్ద ఉన్న మెటీరియల్నే వినియోగించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే హాస్టల్​ఫీజు, మెస్​చార్జీల మోతతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వాపోతున్నారు. దీనికి తోడు కొవిడ్​కారణంగా నిరుపేదలు ఆర్థికంగా కష్టాల ఊబిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక కష్టాల నుంచే ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న పేరెంట్స్ను మరింత ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా లేమని కొందరు వాపోతున్నారు. అయితే ఒక వర్గం నిరుద్యోగులు మాత్రం అప్పు చేసి అయినా సరే.. ఉద్యోగం కొట్టాలని కసితో ప్రిపేర్​అవ్వాలని భావిస్తుండగా నోటిఫికేషన్​వచ్చాక కొందామని ఇంకొందరు భావిస్తున్నారు. నోటిఫికేషన్ వేయకుంటే మళ్లీ నష్టపోతామని, ఇప్పుడే కొని డబ్బులు ఎందుకు వృథా చేసుకోవాలని యువత వేచి చూసే ధోరణిని కనబరుస్తోంది.

ఏ జాబ్​నోటిఫికేషన్​కు సంబంధించిన స్టడీ మెటీరియల్​అయినా అన్నీ ఒకేచోట దొరికే ప్రాంతం కోఠి. కొవిడ్​సమయం నుంచి అటు విద్యాసంస్థలు లేక, ఇటు నోటిఫికేషన్లు లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న కేసీఆర్​నోటిఫికేషన్​ప్రకటన చేసిన వెంటనే కొందరు వ్యాపారులు అప్పు తెచ్చి మరీ మెటీరియల్స్​తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. అయితే సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? అనే అనుమానం కారణంగా నిరుద్యోగులు ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోవడం ఒక కారణమైతే.. ఇప్పటికే ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోయిన నిరుద్యోగులు ఈసారి కూడా నిజంగా నోటిఫికేషన్​వేస్తారో లేదోనని ధైర్యం చేయడంలేదని వాపోతున్నారు. అయితే గ్రామాలకు పరిమితమైన నిరుద్యోగులు క్రమంగా పట్టణానికి వస్తుండటంతో మరో వారం, పది రోజుల్లో పూర్తిస్థాయిగా చేరుకుంటే కొనుగోళ్లు జరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము తెచ్చిన అప్పు రోజురోజుకూ పెరిగిపోతోందని, వ్యాపారం మాత్రం సాగడంలేదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

నోటిఫికేషన్​ఎప్పుడొస్తుందో తెలియదు

సీఎం కేసీఆర్​మాటలు విని ఇప్పటికే చాలాసార్లు మోసపోయాం. అసలు నోటిఫికేషన్​ఎప్పుడొస్తుందో తెలియదు. ఎన్ని పోస్టులకు వేస్తారో తెలియదు. ఎలాంటి గైడ్​లైన్స్​కూడా లేవు. ఇప్పటికే చాలాసార్లు మెటీరియల్స్​కొని ప్రిపేర్​అయ్యాం. కానీ నోటిఫికేషన్లు వేయకుండా మోసం చేశారు. ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్​అసెంబ్లీ సాక్షిగా నోటిఫికేషన్​భర్తీ అన్నారు.. ఆయనను మళ్లీ నమ్మేదెలా?

అమరేందర్​, నిరుద్యోగి

కొనేందుకు ఆసక్తి చూపట్లేదు

నోటిఫికేన్లు అని స్వయంగా సీఎం కేసీఆర్​అని ప్రకటించడంతో అప్పు చేసి మరీ మెటీరియల్​తీసుకొచ్చా. ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడంలేదు. ఇంకో వారం, పది రోజుల్లో అయినా కొనుగోళ్లు జరుగుతాయేమో చూస్తాం. ప్రతి రోజు షాపునకు వచ్చి ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. కొనుగోళ్లు లేక వడ్డీ పెరుగుతోంది.

యూసుఫ్, వ్యాపారి

Next Story

Most Viewed