మృత్యువులోనూ వీడని స్నేహం.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం

by Disha Web |
మృత్యువులోనూ వీడని స్నేహం.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం
X

దిశ, కామారెడ్డి రూరల్ : ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు.. ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఇద్దరు కలిసి పనిమీద బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా లారీ రూపంలో ఇద్దరిని ఒకేసారి మృత్యువు తన ఒడిలో చేర్చుకుంది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి శివారులోని జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన రాహుల్(20), షఫీ(17) ఇద్దరు స్నేహితులు. రాహుల్ మున్సిపల్ కార్మికునిగా పని చేస్తుండగా షఫీ బోర్ వెల్ షాపులో పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఇద్దరు కలిసి బైకుపై రామేశ్వర్ పల్లి గ్రామానికి బయలుదేరారు. రామేశ్వర్ పల్లి నుంచి తిరిగి వస్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటుండగా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బైకును ఢీకొనడంతో పాటు సుమారు 50 మీటర్ల దూరం వరకు బైకును లాక్కెళ్ళింది.

దాంతో బైకుపై ఉన్న రాహుల్, షఫీ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాణ స్నేహితులు రాహుల్, షఫీ ఇద్దరి మృతి ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. అయితే ఈ ఏడాదిలో అదే ప్రాంతంలో సుమారు 10 మంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారని కాలనీ వాసులు తెలిపారు. యూటర్న్ వద్ద బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story