ఈ రైల్వే ఉద్యోగి టిక్కెట్లిచ్చే స్కిల్ కేక‌.. వీడియోతో విజిల్స్‌!

by Disha Web Desk 20 |
ఈ రైల్వే ఉద్యోగి టిక్కెట్లిచ్చే స్కిల్ కేక‌.. వీడియోతో విజిల్స్‌!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ద‌శాబ్ధాల పాటు ఉద్యోగం చేసి, సంపాదించిన‌ నైపుణ్యం అంత సులువుగా స‌మసిపోదు. అందులోనూ, వృత్తిలో మెళ‌కువ‌లు తెలిసిన త‌ర్వాత వ‌య‌సుతో సంబంధం లేకుండా సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా ప‌నిచేస్తుంటారు కొంద‌రు. అలాంటి ఓ వ్య‌క్తి ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయ్యారు. భారతీయ రైల్వేలో రిటైర్డ్ ఉద్యోగి అన్బళగన్ (67) ప్రయాణీకులకు అత్యంత వేగంగా టిక్కెట్లు ఇస్తూ, సోష‌ల్ మీడియా స్టార్ అయ్యారు. చెన్నై నగరంలో ఆటోమేటివ్ టిక్కెట్ వెండింగ్ మెషీన్ (ATVM)ని నిర్వహించే ఈ సీనియర్ సిటిజన్, 10 సెకన్ల వ్యవధిలో 4 టిక్కెట్లను అందజేస్తూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అన్బళ‌గ‌న్ రైల్వేలో 33 సంవత్సరాలు పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏటీవీఎం ఫెసిలిటేటర్‌గా మారాడు. ఉద్యోగం రిటైర్డ్ రైల్వే సిబ్బందికి మాత్రమే కేటాయించ‌డంతో అందులో చేరారు. ప్ర‌స్తుతం చెన్నైలోని ఎగ్మోర్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు.

రద్దీ సమయాల్లో ATVM కియోస్క్‌ను నిర్వహిస్తూ, తన అసమానమైన శైలితో ప్రతిరోజు దాదాపు 1000 టిక్కెట్లను విక్రయిస్తుంటారు. ఇంత స్పీడ్‌గా, పర్ఫెక్ట్‌గా ఆ పనిని ఎలా నిర్వహిస్తున్నారని అడిగితే, టిక్కెట్లు జారీ చేసే క్ర‌మంలో "సెలక్షన్ స్క్రీన్‌లో ఎంచుకోవడానికి డజన్ల కొద్దీ గమ్యస్థానాలు ఉంటాయి. కానీ, నేను ఎలాంటి ఇబ్బంది పడను. టికెట్ ధర రూ.5/10/ 15, కాబట్టి నేను ఈ నిర్దిష్ట మొత్తంలో ప్రయాణించగల చివరి గమ్యస్థానాన్ని ఎంచుకుంటాను. తద్వారా, డజన్ల కొద్దీ స్థానాల్లో ఏది ఎంచుకోవాలో ఇబ్బంది ప‌డ‌కుండా, బదులుగా స్క్రీన్‌పై 3-4 స్టేషన్‌లు మాత్ర‌మే ఎంచుకుంటే స‌రిపోతుంది" అని త‌న స్కిల్ ర‌హ‌స్యం వెల్ల‌డిస్తారు అన్బళగన్. ఈ ప‌నిత‌నం చెప్పే వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అతని సేవలకు గుర్తింపుగా భారతీయ రైల్వే అధికారుల ప్ర‌శంసా ప‌త్రాలు కూడా అందుకున్నారు.


Next Story