దమ్ముంటే కన్నెపల్లి రండి.. నీళ్లు చూపిస్తాం : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

by Batti.Sumithra |

కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లేవని, ఎత్తిపోసే పరిస్థితి లేదని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దమ్ముంటే కన్నెపల్లి పంప్‌హౌస్‌కు రావాలని, అక్కడ ఎన్ని నీళ్లు ఉన్నాయో చూపిస్తామని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ సవాల్‌ విసిరారు.

దమ్ముంటే కన్నెపల్లి రండి.. నీళ్లు చూపిస్తాం : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
X

దిశ, మహదేవపూర్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లేవని, ఎత్తిపోసే పరిస్థితి లేదని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దమ్ముంటే కన్నెపల్లి పంప్‌హౌస్‌కు రావాలని, అక్కడ ఎన్ని నీళ్లు ఉన్నాయో చూపిస్తామని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ సవాల్‌ విసిరారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కన్నెపల్లి పంప్‌హౌస్‌ సందర్శన చేపట్టగా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. పోలీసులు తమను అడ్డుకుంటున్నారని చెప్పినప్పుడు, "పోలీసులతో మాకేంటి సంబంధం?" అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

కన్నెపల్లి పంప్‌హౌస్‌లో నీళ్లు ఉన్నాయని కేటీఆర్‌ ప్రత్యక్షంగా చూపిస్తే, గ్రామాల్లో తమను ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకుందని ఆరోపించారు. అయినప్పటికీ ఐదువేల మందితో పంప్‌హౌస్‌ వద్దకు చేరుకున్నామని చెప్పారు. ఒకప్పుడు నక్సలైట్ల సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకున్న దానికంటే ఎక్కువగా ఇప్పుడు అడ్డుకున్నారని విమర్శించారు. నీళ్లు లేవని, ఎత్తిపోసే పరిస్థితి లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడం, కళ్లుండి కూడా చూడలేని కబోది మాట్లాడినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి మంత్రివర్గం బీఆర్‌ఎస్‌ నాయకులకు సవాల్‌ విసిరి, చివరకు పోలీసులను అడ్డుపెట్టి నిలువరించిందని ఆరోపించారు. చిన్న చిన్న సభలకు హెలికాప్టర్‌లో వెళ్లే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇక్కడికి రావాలని, ఎప్పుడు వస్తారో చెబితే అప్పటి వరకు కేటీఆర్‌ ఇక్కడే ఉండి నీళ్లు ఎందుకు ఎత్తిపోసే అవకాశం ఉందో చూపిస్తారని సవాల్‌ విసిరారు.

కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నాయకులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో మేలు జరిగిందని, ప్రస్తుతం 300 అడుగుల లోతుకు వెళ్లినా నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. మేడిగడ్డ వద్ద చిన్న మరమ్మతు అవసరమైతే కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి అయినా నీటిని ఆపే అవకాశం ఉందని, అయినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో చెరువు మత్తడి తెగితే ఇసుక బస్తాలు వేసి తాత్కాలికంగా నీటిని నిలిపేవారని, అలాంటి ప్రయత్నం కూడా చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే పంటలు పండాయని కాంగ్రెస్‌ నాయకులు చెప్పడం విడ్డూరమన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉందో కూడా వారికి తెలియడం లేదని విమర్శించారు. కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు ఉన్న మొత్తం ప్రాజెక్టు పరిధిని గుర్తించి మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ కళ్లు తెరిపించేందుకు, రాష్ట్రంలోని రైతులను కాపాడేందుకు కేటీఆర్‌ కన్నెపల్లి పంప్‌హౌస్‌ సందర్శన చేపట్టారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను గుర్తించి, రైతుల ప్రయోజనాల దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story