ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో నేను ఓట్లు అడగను

by Ratna Kumari |

ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో తాను ఓట్లు అడగనని, బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడ ఇచ్చిందో అక్కడే ఆ పార్టీ నాయకులు ఓట్లు అడగాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సవాల్ విసిరారు.

ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో నేను ఓట్లు అడగను
X

దిశ, కొత్తకోట : ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో తాను ఓట్లు అడగనని, బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడ ఇచ్చిందో అక్కడే ఆ పార్టీ నాయకులు ఓట్లు అడగాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, అవసరమైన ప్రతి అర్హ కుటుంబానికి ఇళ్లు అందించే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇళ్లు నిర్మించి ఓట్లు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్‌కే ఉందని, బీఆర్ఎస్‌కు లేదని విమర్శించారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ వంటి అవకాశాలను మండల మహిళా సమాఖ్యలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం కంటే అవినీతి, దోపిడీకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, ప్రజల ఆదరణతో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మదనపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు బోయేజ్, అఖిల సుభాష్, సుధా రామ్మోహన్ రెడ్డి, సంజీవులు, మురళి యాదవ్, కరాటే నబి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీచుపల్లి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story