కారులో 30 వేల డిటోనేటర్లు.. ఉగ్రకోణం?

by Muthe.Rajitha |

మేఘాలయలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపింది.

కారులో 30 వేల డిటోనేటర్లు.. ఉగ్రకోణం?
X

దిశ, వెబ్ డెస్క్ : మేఘాలయలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపింది. ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 వేల డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం ఉమ్మియాంగ్‌ ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, సిల్చార్ వైపు వెళ్తున్న ఒక కారు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు దానిని అడ్డుకున్నారు. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, పెట్టెలు, సంచుల్లో అత్యంత ప్రమాదకరమైన 30 వేల డిటోనేటర్లను దాచి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న అస్సాంకు చెందిన కమ్రుల్ అలీ లష్కర్, ఇబ్రహీం ఉద్దీన్ లష్కర్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు. ఇంత భారీ మొత్తంలో డిటోనేటర్లను ఎక్కడి నుండి తీసుకువస్తున్నారు? వీటిని ఎవరికి చేరవేసేందుకు తీసుకెళ్తున్నారు? దీని వెనుక ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా లేదా మైనింగ్ మాఫియా ప్రమేయం ఉందా అనే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పట్టుబడిన పేలుడు పదార్థాల పరిమాణం భారీగా ఉండటంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Next Story