ఆ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఇంటి స్థలం ఫ్రీ.. భారీగా క్యూ కట్టిన మహిళలు

by Disha Web Desk |
ఆ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఇంటి స్థలం ఫ్రీ.. భారీగా క్యూ కట్టిన మహిళలు
X

దిశ, వెబ్​డెస్క్​ : తెలంగాణలో మరో రాజకీయ పార్టీ హల్ చల్ చేయడం కలకలం రేపుతోంది. జై మహాభారత్ పార్టీ పేరుతో వేసిన నయా ఎత్తుగడ ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశం అవుతంది. పార్టీ సభ్యత్వం తీసుకుంటే మహిళలకు ఇల్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో హైదరాబాద్ లోని రవీంద్ర భారతి పక్కన ఉన్న పార్టీ ఆఫీస్ ముందు మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. చిన్నారులు, వృద్ధులు క్యూలో నిల్చుని పార్టీ సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్నారు. రెండు కలర్ ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే పార్టీ మెంబర్ షిప్ ఇస్తున్నారని, సభ్యత్వం తీసుకున్న మహిళలందరికి రాబోయే ఆరు నెలల్లో ఇంటి నిర్మాణానికి 200 గంజాల స్థలాలు ఇస్తామని ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున మహిళలు అక్కడికి చేరుకున్నారు. అయితే రాజకీయ పార్టీ పేరుతో జరుగుతున్న ఈ తతంగంపై కొంత మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ 15 రోజుల్లో జైభారత్ పేరుతో సుమారు 5 లక్షల మందికి మెంబర్ షిప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో సభ్యత్వానికి రూ.10 జిల్లా స్థాయిలో అయితే రూ.20 వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పార్టీ మెంబర్ షిప్ పేరుతో అడ్డగోలుగా ఆధార్ కార్డుల సేకరణ ఇప్పుడు అందరిని ఆశ్చర్యంలోకి నెడుతోంది. అసలు తెలంగాణ రాజకీయాల్లో అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన జైభారత్ పార్టీ ఏంటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జైభారత్ పార్టీ అధ్యక్షుడు అనంత విష్ణు దేవా స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యంలోకి నెడుతోంది. నేనే భగవాన్ విష్ణువునని, లక్ష్మి దేవి భర్తను అని చెప్పుకోవడంతో పాటు 196 దేశాల్లో నేనేంటో పెద్దవాలందరికీ తెలుసని అన్నారు. తనను మించిన ధనవంతుడు ఈ ప్రపంచంలోనే లేడంటూనే చిన్నచితక వారికి తనెవరో తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో అనంత విష్ణు దేవా మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ 2008 లో రిజిస్టర్ అయిందని 2014 లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక స్థానాల్లో పోటీ చేసిందని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఆవిర్భవించిందని వివరించారు.

ఇన్నాళ్లు పరిచయమే లేని ఈ పార్టీ ఇప్పుడు తెలంగాణలో మెంబర్ షిప్ పేరుతో భారీ స్థాయిలో వివరాలు సేకరించడం హాట్ టాపిక్ అవుతోంది. పార్టీ సభ్యత్వం కోసం మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడటం ఇదంతా డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. డీజీపీ కార్యాలయానికి సమీపంలో ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదని విమర్శలు రావడంతో అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే జై భారత్ పార్టీ సభ్యత్వం పేరుతో జరుగుతున్న తంతంగం వెనుక ఉన్నదెవరో తేల్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.


Next Story

Most Viewed