షాబాద్‌లో హైటెన్షన్

by Ratna Kumari |

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్యల ఘటన అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

షాబాద్‌లో హైటెన్షన్
X

దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్యల ఘటన అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు చేపట్టిన రాస్తారోకోతో షాబాద్–షాద్‌నగర్ ప్రధాన రహదారిపై మూడు గంటలకు పైగా ఆందోళన కొనసాగింది. ఆందోళన కారణంగా షాబాద్ నుంచి సర్దార్‌నగర్, షాద్‌నగర్ ఎల్లికట్ట వరకు, మరోవైపు నాగర్‌గూడ వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు.

పోక్సో కేసులో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. నిందితుడిపై గతంలో వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నిందితుడు రాజ్‌కుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్‌ను ఎందుకు ట్రేస్ చేయలేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబంలో మరో బాలిక వికలాంగురాలిగా ఉందని పేర్కొంటూ, ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Next Story