ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి.. భారీ వరదలు, విరిగి పడుతున్న కొండచరియలు

by Muthe.Rajitha |

గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతున్నాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో కుంభవృష్టి.. భారీ వరదలు, విరిగి పడుతున్న కొండచరియలు
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ముంచెత్తుతున్న వరదలు, కొండచరియలు విరిగి పడుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ చేశారు. ఆకస్మిక వరదలతో నదీ తీరాలు కోతకు గురవుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించే ప్రధాన నదుల నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రవాణా వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు, కీలకమైన వంతెనలు కొట్టుకుపోగా, రైల్వే ట్రాక్స్ కూడా భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి రవాణా సంబంధాలు తెగిపోయి, సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

మరోసారి అతి భారీ వానలు.. హెచ్చరించిన IMD

రాబోయే రోజుల్లో కూడా ఈశాన్య ప్రాంతమంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. వర్షాలు ఇలాగే కొనసాగితే ఇప్పటికే బలహీనంగా మారిన కొండ ప్రాంతాలలో మరిన్ని కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎమ్‌డి హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు వాతావరణ రక్షణ చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు, బలహీన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచారు.

Next Story