హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా.. పార్ట్ టైమ్ ఛైర్మన్‌గా కేకి మిస్త్రీ

by Malleboina Mahesh |

నైతిక కారణాలతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా. ఆర్‌బీఐ ఆమోదంతో మధ్యంతర ఛైర్మన్‌గా కేకి మిస్త్రీ నియామకం.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా.. పార్ట్ టైమ్ ఛైర్మన్‌గా కేకి మిస్త్రీ
X

దిశ, వెబ్ డెస్క్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్, ఇండిపెండెంట్ డైరెక్టర్ అతాను చక్రవర్తి తన పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత రెండేళ్లుగా బ్యాంక్‌లో జరుగుతున్న కొన్ని 'పరిణామాలు, పద్ధతులు' (Happenings and Practices) తన వ్యక్తిగత విలువలు, నైతికతకు (Ethics) అనుగుణంగా లేవని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కేవలం ఈ నైతిక కారణాల వల్లే తాను తప్పుకుంటున్నానని, ఇతర కారణాలేవీ లేవని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. 2021లో బోర్డులో చేరిన ఆయన, హెచ్‌డీఎఫ్‌సీ-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనం వంటి కీలక ఘట్టాల్లో ముఖ్య పాత్ర పోషించారు.

ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్.. మధ్యంతర ఛైర్మన్‌గా కేకి మిస్త్రీ!

అతాను చక్రవర్తి నిష్క్రమణతో తలెత్తే ఇబ్బందులను నివారించడానికి ఆర్‌బీఐ వేగంగా స్పందించింది. బ్యాంక్ విజ్ఞప్తి మేరకు ట్రాన్సిషన్ అరేంజ్‌మెంట్‌లో భాగంగా కేకి మిస్త్రీని మధ్యంతర పార్ట్ టైమ్ ఛైర్మన్‌గా నియమించేందుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. మార్చి 19, 2026 నుంచి మూడు నెలల కాలానికి ఆయన ఈ బాధ్యతలు చేపడతారు. ఇదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒక పటిష్టమైన ఆర్థిక సంస్థ అని, దాని పాలన (Governance)- ప్రవర్తనపై ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళనకర అంశాలు లేవని ఆర్‌బీఐ భరోసా ఇచ్చింది. అయినప్పటికీ, ఒక సీనియర్ చైర్మన్ నైతిక కారణాలను చూపిస్తూ తప్పుకోవడం మార్కెట్ వర్గాల్లో స్వల్ప కలకలం రేపిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Next Story