మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై గురు-శిష్యుల కలయిక

by Batti.Sumithra |

మూడు దశాబ్దాల తర్వాత వివిధ వృత్తుల్లో స్థిరపడ్డ శిష్యులు, వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గురువులతో అపూర్వంగా ఒకే వేదికపై కలుసుకున్నారు.

మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై గురు-శిష్యుల కలయిక
X

దిశ, శంకర్‌పల్లి : మూడు దశాబ్దాల తర్వాత వివిధ వృత్తుల్లో స్థిరపడ్డ శిష్యులు, వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గురువులతో అపూర్వంగా ఒకే వేదికపై కలుసుకున్నారు. శంకర్‌పల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం మణి గార్డెన్‌లో జరిగింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించడం విశేషం. శంకర్‌పల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1995–96 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులతో కలిసి చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉపాధ్యాయులు నాగభూషణం, అలీ ఖాన్, అనసూయదేవి, యాదయ్య, సత్యనారాయణ, నారాయణ, భాస్కర్తో పాటు కార్యాలయ కోఆర్డినేటర్ చాంద్ సుల్తానాను పూలవర్షం కురిపిస్తూ వేదికపైకి ఆహ్వానించారు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న అప్పటి ఉపాధ్యాయుడు రామాంజనేయులు ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై చేరి పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మూడు దశాబ్దాల కాలంలో జీవితంలో సాధించిన విజయాలు, ఎదురైన అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆత్మీయంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల పూర్వ విద్యార్థి, రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు ఎం.డి. సలీం పాషా సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ, తాము విద్యను బోధించిన విద్యార్థులను మళ్లీ కలుసుకోవడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా నిలిచిందని తెలిపారు. మూడు దశాబ్దాల కాలంలో మరణించిన ఉపాధ్యాయులు, సహ విద్యార్థుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.

Next Story