కాలేయ వ్యాధులపై ఆఖరి హెచ్చరిక పుస్తకాల ఆవిష్కరణ

by Malleboina Mahesh |

ప్రముఖ హెపటాలజిస్ట్ డాక్టర్ కె.ఎస్. సోమశేఖరరావు రచించిన 'లాస్ట్ వార్నింగ్' (ఇంగ్లీష్), 'ఆఖరి హెచ్చరిక' (తెలుగు) పుస్తకాలను హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్‌లో ఆవిష్కరించారు.

కాలేయ వ్యాధులపై ఆఖరి హెచ్చరిక పుస్తకాల ఆవిష్కరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాలేయ వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రముఖ హెపటాలజిస్ట్ డా. కె.ఎస్. సోమశేఖరరావు రచించిన లాస్ట్ వార్నింగ్(ఇంగ్లీష్), ఆఖరి హెచ్చరిక (తెలుగు) పుస్తకాలను హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఎంపీ శబరి బైరెడ్డి, యశోద హాస్పిటల్స్ ఎండీ డా. జి.ఎస్. రావుతో కలిసి ఈ పుస్తకాలను ఆవిష్కరించారు. దేశంలో ఫ్యాటీ లివర్, వైరల్ హెపటైటిస్, మద్యపాన సంబంధిత కాలేయ సమస్యలు, లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. సరైన అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా వీటిని అరికట్టవచ్చని తెలిపారు. వైద్య పరిజ్ఞానం లేని సాధారణ ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకునేలా, ప్రతి అధ్యాయాన్ని నిజ జీవిత కేస్ స్టడీతో రచయిత రూపొందించడం అభినందనీయమన్నారు.

అవగాహన కల్పించడమే అత్యుత్తమ వైద్యం: డాక్టర్ కె.ఎస్. సోమశేఖరరావు

కాలేయం నిశ్శబ్దంగా పనిచేసే అవయవమని... ముదిరిపోయే వరకు వ్యాధి లక్షణాలు బయటపడవని పుస్తక రచయిత, సీనియర్ హెపటాలజిస్ట్ డా. కె.ఎస్. సోమశేఖరరావు పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి కాలేయ వ్యాధుల ప్రారంభ సంకేతాలపై అవగాహన కల్పించడమే తన లక్ష్యమన్నారు.. వ్యాధి రాకముందే అడ్డుకోవడమే అత్యుత్తమ వైద్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డా. సోమశేఖర రావు వద్ద చికిత్స పొంది కోలుకున్న పలువురు లివర్ హెల్త్ అంబాసిడర్లకు తొలి ప్రతులను అందజేశారు. ఈ పుస్తకాలను కాలేయ వ్యాధి గ్రస్తులకు, వారి కుటుంబాలకు అంకితం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే, ఈ పుస్తక రచనకు స్ఫూర్తినిచ్చిన వివేకానంద్ మిశ్రాను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.

Next Story