ఆందోళన కలిగిస్తున్న 'గన్​కల్చర్'​.. వారి వద్ద తుపాకులు ఉండవా..?

by Disha Web Desk 19 |
ఆందోళన కలిగిస్తున్న గన్​కల్చర్​.. వారి వద్ద తుపాకులు ఉండవా..?
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: ప్రశాంత పల్లె వాతావరణంలో తుపాకుల శబ్ధాలు వినిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో అన్నల కాలంలో వినిపించిన ఆ చప్పుళ్లు ఇప్పుడు మళ్ళీ చెవినపడుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్​వ్యాపారం జోరందుకున్నది. రోజుల వ్యవధిలోనే లక్షల్లో ఉన్న భూముల విలువ కోట్లలకు చేరుకుంది. క్రయ, విక్రయాల నేపథ్యంలోని చిన్న గొడవలు చంపుకునే వరకు వస్తున్నాయి. పంచాయతీలు పెట్టి సెటిల్​చేసుకునే రోజుల నుంచి కాల్చిపారేస్తామనే రేంజ్‌కు రియల్ మాఫీయా వృద్ధి చెందిందని చెప్పకోవచ్చు. గ్రామాల్లో తిరిగే రియల్​వ్యాపారుల వద్దకు తుపాకులు వస్తున్నాయి. బెదిరించడానికి ఎవరు పడితే వారు తుపాకులు కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవల సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసిన రెండు ఘటనలు రుజువు చేస్తున్నాయి. పల్లె ప్రాంతాలకు గన్​కల్చర్​రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇక్కడ వాడుతున్న ఈ తుపాకులు యూపీ నుంచి వస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంటే గన్‌కు కేరాఫ్​యూపీగా మారిందని స్పష్టం అవుతున్నది.

సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలు..

ఇటీవల సిద్దిపేట జిల్లాలో జరిగిన రెండు కాల్పుల ఘటనలు సంచలనం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో నిందితులు తుపాకీ ఉపయోగించడం అందోళన కలిగిస్తున్నది. జనవరి 31న సిద్దిపేట పట్టణంలోని సబ్​రిజిస్ట్రేషన్​ఆఫీస్​వద్ద కారులో ఉన్న ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.44 లక్షల బ్యాగును ఎత్తికెళ్లిన విషయం తెలిసిందే. క్షణాల్లోనే సదరు యువకులు బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. తరువాత పోలీసులు వారిని అరెస్ట్ చేసి డబ్బు, తుపాకీ, ఫోన్లు స్వాధీనం చేసుకున్న విషయం విధితమే. ఈ కాల్పుల ఘటనలో పట్టుబడిన నలుగురు సికింద్రాబాద్​సిద్దిపేట, యాదాద్రి ప్రాంతాలకు చెందిన వారే. ఇదిలా ఉండగా ఈనెల 9న తొగుట మండలం వెంకట్రావ్​పేట శివారులో

తన తల్లితో కలిసి వెళుతున్న వంశీపై మరో యువకుడు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. తృటిలో తప్పించుకున్న వంశీ పోలీసులను ఆశ్రయించాడు. రెప్పపాటులో వంశీ బతికిపోయినట్లు ఘటన జరిగిన ప్రదేశాన్ని చూస్తే అర్థం అవుతున్నది. పథకం ప్రకారం కాపుకాసి తుపాకీతో కాల్పులు జరిపారు. మునుపెన్నడూ గన్​కల్చర్​చూడకపోవడంతో ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

యూపీ నుంచి తుపాకుల కొనుగోలు..

సిద్దిపేట జిల్లాలో 37 రోజుల వ్యవధిలో జరిగిన రెండు కాల్పుల ఘటనలో నిందితులు వాడిన తుపాలు ఉత్తరప్రదేశ్​రాష్ట్రం నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సబ్​రిజిస్ట్రార్​ఆఫీసు వద్ద జరిగిన కాల్పుల్లో వాడిన గన్‌ను సదరు నిందితులు యూపీ నుంచే తెచ్చుకున్నట్లు చెప్పుకున్నారు. యూపీ నుంచి ఇక్కడ పనిచేయడానికి వస్తున్న వర్కర్ల నుంచి సమాచారం తీసుకుని రియల్టర్లతో పాటు ఇతరు తుపాకులు కొనుగోలు చేస్తునట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వెంకట్రావ్​పేట సమీపంలో వంశీపై జరిపిన కాల్పుల ఘటనలో వాడిన తుపాకీ కూడా యూపీ నుంచే తెప్పించుకున్నారు. యూపీ నుంచి వచ్చిన కూలీల ద్వారా గన్​తెప్పించుకున్నట్లు నిందితులు పోలీసులకు చెప్పారు. అయితే ఘటనలు జరగడంతో ఈ రెండు తుపాకుల గురించి మాత్రమే తెలిసింది. ఇంకా తెలియకుండా ఎందరి వద్ద తుపాకులు ఉన్నాయో అనే అంశంపై జనంలో చర్చ జరుగుతుంది. చిన్న పాటి గొడవలకే తుపాకులు వాడుతున్నారంటే బడా రియల్​వ్యాపారుల వద్ద తుపాకులు ఉండవా..? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.

పల్లెల్లో 'రియల్​' చిచ్చు..

భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో రియల్​వ్యాపారం జోరుగా సాగుతున్నది. రియల్​ఎస్టేట్​ఆఫీసులు ఏర్పాటు చేసుకుని దందాలు చేస్తున్నారు. గ్రామాల్లో రోజు భూములు చూసిపోయేవాళ్లు కనిపిస్తున్నారు. భూమి కొనుగోలు చేయడం కొంత అడ్వాన్సు ఇవ్వడం, ఆ భూమికి రోజుల వ్యవధిలోనే ధర రెట్టింపు కావడం. దీనితో అడ్వాన్స్​ఇచ్చిన వారికి భూమి ఇవ్వడానికి భూ యజమానులు ముందుకు రాకపోవడం. అంతే కాకుండా గ్రామాల్లో కుటుంబ సభ్యులు మధ్య కూడా భూ పంచాయతీలు పెరిగాయి. ఇలాంటి భూ పంచాయతీలు సాధారణమయ్యాయి. దొంగ పత్రాలు సృష్టించి భూములు కాజేసే వాళ్లు పుట్టుకొస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీస్​స్టేషన్లకు ఇలాంటి కేసులే ఎక్కువ వస్తున్నాయి. ఈ భూ పంచాయతీలు కొట్టుకోవడం, కాల్చి చంపుకోవడం వరకు వెలుతున్నాయి. భూముల ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో కేసులు, ఘర్షణలు, కొట్లాటలు, చంపుకునే ఘటనలు పెరుగుతున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.


Next Story