కౌన్సిల్ ముందుకు జీఎస్టీ 5 శాతం శ్లాబ్‌ను 8 శాతానికి పెంచే ప్రతిపాదన!

by Disha Web |
కౌన్సిల్ ముందుకు జీఎస్టీ 5 శాతం శ్లాబ్‌ను 8 శాతానికి పెంచే ప్రతిపాదన!
X

దిశ, వెబ్‌డెస్క్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబ్‌లలో కీలక మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ శ్లాబ్‌ను 5 శాతానికి బదులుగా 8 శాతం నుంచి ప్రారంభమయ్యే మార్పులు చేయనున్నట్టు సమాచారం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఆధారపడకుండా ఆదాయాలను పెంచుకోగలవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

దీనికి సంబంధించిన నివేదికను ఆర్థిక మంత్రుల బృందం జీఎస్టీ కౌన్సిల్‌కి సమర్పించినట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి జీఎస్టీ శ్లాబ్‌లు 5,12,18,28 శాతంతో ఉన్నాయి. ఇందులో 12 శాతం శ్లాబ్‌ను మొత్తానికే తొలగించి, ఈ జాబితాలో ఉన్న వస్తువులను 18 శాతం పరిధిలోకి మార్చాలని ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం అత్యవసర వస్తువులన్నింటిని 5 శాతం పరిధిలో, ఖరీదైన, విలాసవంతమైన వస్తువులను 28 శాతం పరిధిలో ఉంచారు. కొన్ని అత్యంత విలాసమైన వస్తువులపై అదనంగా సెస్ కూడా అమలవుతోంది.

ఇందులోంచి జీఎస్టీ వల్ల ఆదాయాన్ని నష్టపోయే రాష్ట్రాలకు పరిహారంగా కేంద్రం ఇస్తోంది. తాజా ప్రతిపాదన 5 శాతం శ్లాబ్‌ను 8 శాతానికి పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ. 1.50 లక్షల కోట్ల అదనపు ఆదాయం వస్తువుందని అంచనా. ఇటీవల జీఎస్టీ గణాంకాల ప్రకారం అతి తక్కువ పన్ను శ్లాబ్‌ను 1 శాతం వద్ద ఉంచితే అదనంగా రూ. 50 వేల కోట్లు వస్తాయని కేంద్రం భావిస్తోంది. కాగా, జీఎస్టీ అమలు రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ఈ విధానం అమలైన నాటి నుంచి పరిహారంగా ఇస్తోంది. దీనికి ఈ ఏడాది జూన్ చివరి గడువు. కాబట్టి రాష్ట్రాలు ఇకమీదట నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా ఉండేందుకు కొత్త మార్పులను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed