అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా గ్రీన్ రిసార్ట్..?

by Jakkula.Mamatha |

నర్సంపేట పట్టణ శివారులో గల గ్రీన్ రిసార్ట్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు గత కొంత కాలంగా వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా గ్రీన్ రిసార్ట్..?
X

దిశ,నర్సంపేట: నర్సంపేట పట్టణ శివారులో గల గ్రీన్ రిసార్ట్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు గత కొంత కాలంగా వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఆరుగురు పేకాట రాయుళ్లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.12 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నర్సంపేట ఎస్సై అరుణ్ కుమార్ వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వీరు ఖానాపురం మండలానికి చెందిన వారిగా గుర్తించారు. తమ్మిశెట్టి సురేష్, వీరమనేని.సాగర్, శాఖమూరి వెంకటేశ్వర రావు, వీ. బద్రూ, జె. రమేష్ సహా సర్వపురానికి చెందిన వేముల. కృష్ణ రెడ్డి గా గుర్తించారు. 6 సెల్ ఫోన్లు, 3 బైక్స్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

పేరుకు పెద్ద రెస్టారెంట్.. అనుమతులు నిల్..?

గ్రీన్ రిసార్ట్ పై కొంత కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. సదరు బిల్డింగ్‌లకు అనుమతులు లేవు, నిబంధనలు పాటించడం లేదంటూ నర్సంపేట మున్సిపల్ అధికారులకు ఓ అఙ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గ్రీన్ రిసార్ట్‌కు నోటీసులు అందజేశారు. అయినప్పటికీ అనుమతి పత్రాలు మున్సిపల్‌లో అందజేయలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రెండో నోటీసు సైతం అందజేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా... గ్రీన్ రిసార్ట్ వ్యవహారం పట్ల స్థానికంగా చర్చ జరుగుతోంది.

ట్రేడ్ లైసెన్స్ నిల్..!

నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామం ఇటీవల నర్సంపేట మున్సిపాలిటీలో చేరింది. మహేశ్వరం పరిధిలో ఉన్న గ్రీన్ రిసార్ట్ బిల్డింగ్‌కి అనుమతులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ట్రేడ్ లైసెన్స్ లేనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఫుడ్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి రెండేళ్లకు అనుమతి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం మళ్లీ ఎలాంటి అనుమతులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రీన్ రిసార్ట్ అనుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Next Story