బంగారంపై దిగుమతి సుంకం పెంచేసిన కేంద్రం!

by Disha Web Desk |
బంగారంపై దిగుమతి సుంకం పెంచేసిన కేంద్రం!
X

న్యూఢిల్లీ: బంగారం కొనేవారికి కేంద్ర ప్రభుత్వం చేదువార్త అందించింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10.75 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచేసింది. కరెంట్ ఖాతా లోటును అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు, పెంచిన సుంకం జూన్ 30 నుంచే అమల్లోకి వచ్చినట్టు శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఇటీవల డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలోనే రూపాయి పతనానికి సంబంధించి ఒత్తిడి తగ్గించడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రధానంగా బంగారం దిగుమతులు అత్యధికంగా ఉండటంతో దీనిపై దృష్టి సారించింది.

మే నెలలో భారత్ మొత్తం 107 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. జూన్‌లో కూడా ఇదే స్థాయిలో బంగారం దిగుమతి అయింది. ఈ నేపథ్యంలో కరెంట్ ఖాతా లోటు పెరుగుతున్నందున దిగుమతి సుంకాన్ని పెంచినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్‌లో వివరించింది. ఇదివరకు పసిడిపై ప్రాథమిక దిగుమతి సుంకం 7.5 శాతం ఉండగా, దీన్ని 12.5 శాతానికి పెంచారు. దీనికి అదనంగా 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఉంటుంది. దీంతో మొత్తంగా బంగారం దిగుమతిపై సుంకం 15 శాతానికి చేరుకుంది. అలాగే, ఈ మొత్తానికి 3 శాతం అదనంగా జీఎస్టీ అమలవుతుంది. ఈ పెంపు ద్వారా బంగారం కొనడం మరింత భారం కానుంది. ఇంతకుముందు కేంద్రం బంగారం అక్రమ రవాణాను నియంత్రించేందుకు పసిడిపై దిగుమతి సుంకాన్ని 7.5 నుంచి 4 శాతానికి తగ్గించాలని దేశీయ ఆభరణాల వ్యాపారులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కానీ, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సుంకాన్ని పెంచడం గమనార్హం. తాజా పరిణామంతో పసిడి ధరలు పెరగనున్నాయి.


Next Story

Most Viewed