ఢిల్లీకి గవర్నర్.. సీఎం కేసీఆర్‌కు చిక్కులు తప్పవా..?

by Disha Web Desk |
ఢిల్లీకి గవర్నర్.. సీఎం కేసీఆర్‌కు చిక్కులు తప్పవా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు మేరకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మంగళవారం ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఆమె సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ఆ తర్వాత ప్రధానితోనూ గవర్నర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నది. తొలుత షెడ్యూలు ప్రకారం సోమవారమే ఆమె వెళ్ళాల్సి ఉన్నది. కానీ చివరి నిమిషాల్లో వాయిదా పడింది. ఆ ప్రకారం మంగళవారం రాత్రి ఆమె హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడే గవర్నర్‌ను పిలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలూ ఈ భేటీలో చర్చకు రానున్నాయి.

స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ మీద ఫోకస్ పెట్టినట్లు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే గవర్నర్‌ను అమిత్ షా పిలిపించడం చర్చలకు దారితీసినట్లయింది. రాష్ట్రంలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్ పెరిగిందంటూ స్వయంగా గవర్నరే ఈ నెల 1వ తేదీన కామెంట్ చేశారు. గ్యాప్ తనవైపు నుంచి జరగలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి పలు సందర్భాల్లో గవర్నర్‌కు ప్రోటోకాల్ సైతం అమలుకాలేదు. ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించి, అయినా బాధపడడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ అంశాలన్నింటిపై హోం మంత్రికి గవర్నర్ వివరించే అవకాశం ఉన్నది. గవర్నర్ తన నివేదికలో ఏయే అంశాలను ప్రస్తావిస్తారు, హోం మంత్రితో ఏమేం చర్చిస్తారు, దాని తదుపరి కేంద్ర హోం శాఖ నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది.. ఇవీ ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి. రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరిగిపోవడంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నలిగిపోతున్నారు. గవర్నర్‌కు పలు పర్యటనల్లో అధికారులు కూడా హాజరుకాలేదు. కరోనా టైమ్‌లో నిమ్స్ ఆస్పత్రిని గవర్నర్ సందర్శించినప్పటి నుంచి సీఎంకు గ్యాప్ మొదలైంది. కౌశిక్ రెడ్డిని సోషల్ సర్వీసు కేటగిరీ కింద నామినేటెడ్ పొస్టులో ఎమ్మెల్సీగా చేయాలని మంత్రిమండలి ఆమోదం తెలిపి ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపిన తర్వాత ఆమోదం లభించకపోవడంతో తారస్థాయికి చేరింది.

ఆ గ్యాప్ ఇటీవలి కాలంలో మరింతగా పెరిగింది. రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవానికి ముఖ్యమంత్రి హాజరుకాలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగిపోయాయి. ముఖ్యమంత్రి వైపు నుంచి మాత్రమే కాక ప్రభుత్వం తరఫున కూడా అధికారులు హాజరుకావడంలేదు. ఫిబ్రవరిలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మంత్రులు, అధికారులు ఆమెకు స్వాగతం పలకలేదు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌ టైగర్ రిజర్వు ఫారెస్టులోని చెంచు గ్రామాల పర్యటనకు వెళ్ళినప్పుడూ ప్రభుత్వం తరఫున నిర్దిష్ట ప్రోటోకాల్ లభించలేదు. గత నెలలో కేంద్ర ప్రభుత్వం తరఫున వరంగల్ పట్టణంలో జరిగిన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ కార్యక్రమానికి హాజరైన గవర్నర్‌ను నగర ప్రథమ పౌరురాలైన మేయర్ కూడా ప్రోటోకాల్ ప్రకారం కలవలేదు. తాజాగా ఈ నెల 1వ తేదీన రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు కూడా అధికారులు హాజరుకాలేదు.

ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ అంశాలన్నింటిపై హోం మంత్రికి గవర్నర్ వివరించే అవకాశం ఉన్నది. ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు సహా 2017 నుంచి రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న డ్రగ్స్, పబ్ తదితర అంశాలన్నింటినీ ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. తాజాగా యాదాద్రి ఆలయాన్ని సందర్శించినప్పుడు గవర్నర్‌కు కనీసం ఎగ్జిక్యూటివ్ అధికారి స్వాగతం పలకకపోవడం కూడా ఇటీవల చర్చలకు దారితీసింది. ఈ అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. ఈ భేటీ తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఏ రూపం తీసుకుంటాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే గవర్నర్‌ను కేంద్ర హోం మంత్రి ఢిల్లీకి పిలిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా తో భేటీ తర్వాత ప్రధానితోనూ ఆమె భేటీ కానున్నట్లు ప్రాథమిక సమాచారం.



Next Story

Most Viewed