'కొత్త పరిశోధనలు ముందుకు రావాలి'.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web |
కొత్త పరిశోధనలు ముందుకు రావాలి.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, కంది : ప్రస్తుతం మారుతున్న కాలానికి ధీటుగా దేశంలో మరిన్ని గర్వించదగ్గ కొత్త పరిశోధనలు చేసి ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ వేదికగా జీవన్ లైట్ పేరుతో రూపొందించిన సరికొత్త స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ పరికరాన్ని ఆమె పాల్గొని ప్రారంభించారు.

తెలంగాణ ఇన్నోవేషన్ ప్రైడ్..

ఐఐటీ హైదరాబాద్ తమ సరికొత్త పరిశోధనలతో తెలంగాణ ఇన్నోవేషన్ ప్రైడ్‌గా నిలుస్తుందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఏరోబిక్స్ రిప్రజెంటేటివ్స్ ప్రొఫెసర్లు రాజేష్, సిరిల్ ఆంటోనీ బృంద సభ్యులు జీవన్ లైట్ పేరిట రూపొందించిన సరికొత్త వెంటిలేటర్ పనితీరును గవర్నర్‌కు స్వయంగా వివరించి చూపించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో తన కార్యాలయానికి రోజు వేలాది ఫోన్లు, మెసేజ్‌లు వచ్చేవని, ఇందులో ప్రధానంగా వెంటిలేటర్‌తో కూడిన బెడ్ కావాలనే వారి సంఖ్య ఎక్కువగా వచ్చేవని చెప్పారు. అయితే అప్పటి సమయంలో ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తిరిగి అలాంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ రాకూడదని ఆమె కోరారు.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇతర దేశాల కంటే భారత దేశం వైద్య రంగంలో, అలాగే వైద్య నూతన పరికరాలు తయారీలో ముందుకు సాగుతుండడం గొప్ప విషయమన్నారు. ఇకపోతే ఇప్పటికే భారతదేశంలో 180 కోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నామన్నారు. అయితే తాను కూడా మన దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్నే వేసుకున్నట్లు ఆమె చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ ఈ సరికొత్త వెంటిలేటర్ పరికరాన్ని రూపొందించడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. కాకపోతే ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించి మంచి పౌష్టికాహారంతో పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేసి రోగాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కోవిడ్ నాలుగో దశ వచ్చినా కూడా దానిని దీటుగా ఎదుర్కొనేలా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలన్నారు. మన పరిశోధనలు చిన్నవైనా, పెద్దవైనా అవి దేశానికి ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలి అందకు యువతీ యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


తక్కువ ధరకే జీవన్ లైట్ ఐసీయూ వెంటిలేటర్

ఐఐటీ హైదరాబాద్ కేంద్రంగా రూపొందించిన జీవన్ లైట్ ఐసీయూ వెంటిలేటర్ ప్రతి ఒక్కరికీ తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఐఐటీ చైర్మన్ బి.వి.మోహన్ రెడ్డి, డైరెక్టర్ బి.ఎస్.మూర్తిలు వెల్లడించారు. ఈ పరికరాన్ని ఎంతో సులువుగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఉపయోగించే విధంగా తీర్చి దిద్దడం జరిగిందన్నారు. ఊపిరితిత్తుల్లో శ్వాస సంబంధిత సమస్యలను ఈ పరికరం సెన్సార్ సహాయంతో గుర్తించి రోగికి అవసరమైన శ్వాసను అందించేలా రూపొందించడం దీని విశిష్టత అని వారు వివరించారు. నాలుగు నుంచి ఐదు గంటల పాటు నిర్విరామంగా నడిచే విధంగా ఇందులో ఇన్బిల్ట్ బ్యాక్అప్ బ్యాటరీని కూడా అమర్చినట్లు పరిశోధక బృంద సభ్యులు వివరించారు. అనంతరం కొత్తగా రూపొందించిన ఈ జీవన లైట్ పది యూనిట్ పరికరాలను పరిశోధక బృందం సభ్యులు గవర్నర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story