LIC లో వాటా తగ్గించే అవకాశం లేదన్న ప్రభుత్వం!

by Disha Web Desk 17 |
LIC లో వాటా తగ్గించే అవకాశం లేదన్న ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ బీమా సంస్థ LIC స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వం తన వాటాను తగ్గించే అవకాశం లేదని ఓ ప్రకటనలో వెల్లడైంది. ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనబోయే ఇన్వెస్టర్లకు నష్టం ఉండకూడదనే ఉద్దేశ్యం కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎల్ఐసీ ఐపీఓ రోడ్‌షోలో పెట్టుబడిదారులకు స్పష్టం చేసింది. ఎల్ఐసీ చట్టంలో చేసిన మార్పుల నేపథ్యంలో ప్రభుత్వం తన వాటాను 75 శాతం వరకు తగ్గించే వెసులుబాటు ఉంది. ఈ కారణంగానే ఐపీఓ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం తన వాటాను తగ్గిస్తుందనే సంకేతాలు వినిపించాయి.

ఈ క్రమంలోనే ఆ ఉద్దేశ్యం లేదని, రెండేళ్ల వరకు వాటాను తగ్గించే ఆస్కారం లేదని ఉన్నతాధికారి మదుపర్లకు స్పష్టత ఇచ్చారు. సాధారణంగా స్టాక్ మార్కెట్ల నిబంధనల ప్రకారం.. ఐపీఓ అనంతరం ఏదైనా కంపెనీ పరిమాణం రూ. లక్ష కోట్లు దాటితే, ఐదేళ్లలోగా పబ్లిక్ షేర్‌హోల్డింగ్ వాటాను కనీసం 25 శాతానికి పెంచాల్సి ఉంటుంది.ఇదే సమయంలో ఎల్ఐసీకి సంబంధించి ప్రభుత్వం రాబోయే ఐదేళ్ల వరకు వాటాను తగ్గించేందుకు సిద్ధంగా లేదు. దీనికోసం నియంత్రణ సంస్థల నుంచి మినహాయింపు కోసం అభ్యర్థించవచ్చని సంబంధిత అధికారి వివరించారు.

Next Story