బాచుపల్లిలో ప్రభుత్వ స్థలం కబ్జా

by Dishanational1 |
బాచుపల్లిలో ప్రభుత్వ స్థలం కబ్జా
X

దిశ, నిజాంపేట్: బాచుపల్లిలో ప్రభుత్వ స్థలం కబ్జాల మయంతో కుంచించుకుపోతుంది. భవిష్యత్ లో ప్రభుత్వ అవసరానికి అనుగుణంగా ఉండాల్సిన ప్రభుత్వ భూములు అధికారుల నిర్లక్ష్యంతో కబ్జాదారులకు వరంగా మారుతున్నాయి. బాచుపల్లి సర్వే నెంబర్ 186 లో గల ప్రభుత్వ స్థలం తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉంది. ప్రభుత్వ భవిష్యత్ అవసరాల నిమిత్తం ఉంచిన ఇట్టి స్థలంలో కొందరు కబ్జా దారులు రాత్రికి రాత్రే రూములు కడుతూ కబ్జాలోకి వెళ్తున్నారు. ప్రభుత్వం పూర్వం తెచ్చిన 58,59 జీవోలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములు హస్తగతం చేసుకుంటూ కోట్లాది రూపాయల ప్రభుత్వ వనరులను లూఠీ చేస్తున్నారు.

గతంలో ఈ సర్వే నెంబర్ లోని ప్రభుత్వ స్థలంలో కొందరు స్థానిక నాయకుల అండదండలతో ఓ ప్రైవేట్ కాలనీ వేసి అమాయకులకు అమ్మి సొమ్ముచేసుకున్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు కబ్జా దారులకు అనధికారికంగా సహకరిస్తుండడంతో కబ్జాదారులు రెచ్చిపోతూ ప్రభుత్వ ఆస్తులు కొళ్లగొట్టడమే ధ్యేయంగా చేసుకుని ముఠా కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజాగా మళ్లీ కబ్జా...

బాచుపల్లి సర్వే నెంబర్ 186లో సుమారు రెండు వందల గజాల ప్రభుత్వ స్థలం స్థానికంగా ఓ నాయకుడు కబ్జా చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. కాపాడే హౌసింగ్ బోర్డు అధికారులు వెనుకుండి సహకారం అందించడంతో ఇన్నాళ్లు ఆగిన ఆ ప్రభుత్వ స్థలం ప్రభుత్వ సెలవు దినాలలో రాత్రికి రాత్రే రూము, ప్రహరీ గోడలతో అవతరించింది. సుమారు కోటి రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలం కళ్లెదుటే కనుమరుగవుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.

ఆ స్థలం కాపాడుకోవాల్సిన బాధ్యత హోసింగ్ బోర్డు అధికారులదే: బాచుపల్లి ఎమ్మార్వో సరిత

బాచుపల్లి ప్రభుత్వ సర్వే నెంబర్ 186 లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై దిశ బాచుపల్లి తాహశీల్దార్ సరితను వివరణ కోరగా ఆ స్థలం తెలంగాణ హౌసింగ్ బోర్డు శాఖకు కేటాయించినట్లు తెలిపారు. ఆ స్థలం రక్షణలో వారిదే బాధ్యత అన్నారు. కబ్జాల విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

ఆ స్థలం మాది కాదు రెవెన్యూ శాఖదే: హోసింగ్ బోర్డు ఈఈ రాధాకృష్ణ

బాచుపల్లి సర్వే నెంబర్ 186 లో గల ప్రభుత్వ స్థలం కబ్జా విషయంపై తెలంగాణ హౌసింగ్ బోర్డు రీజియన్ ఈఈ రాధాకృష్ణను 'దిశ' వివరణ కోరగా ఆ స్థలం తమది కాదని తమకు ఇచ్చిన స్థలం చుట్టూ పెన్సింగ్ వేసుకున్నామని, మిగతా స్థలం రెవెన్యూ అధికారులదే బాధ్యత అన్నారు. కాపాడాల్సింది రెవెన్యూ అధికారులే అని అన్నారు.


Next Story