ప్రాణాలకు ముప్పు.. కేంద్ర హోంమంత్రి జోక్యం కోరిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్!"

by Malleboina Mahesh |   (  Updated:2026-03-21 15:42:54  IST  )

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 'స్నైపర్' ముప్పు? తన ప్రాణానికి, కుటుంబానికి వస్తున్న బెదిరింపులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసి ఉన్నత స్థాయి విచారణ కోరారు.

ప్రాణాలకు ముప్పు.. కేంద్ర హోంమంత్రి జోక్యం కోరిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్!
X

దిశ, వెబ్ డెస్క్: తనకు ప్రాణ హాని ఉందని హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యవసర లేఖ రాశారు. గత కొద్ది రోజులగా తనకు తన కుటుంబ సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నిరంతరం ఫోన్ కాల్స్, లేఖల ద్వారా ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని ఆయన తన ఫిర్యాదులో హోంమంత్రికి తెలిపారు. శ్రీరామనవమి శోభాయాత్ర సమయంలో తనను అంతమొందించేందుకు 'స్నైపర్లను' సైతం రంగంలోకి దించినట్లు తనకు సమాచారం ఉందని, ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర పోలీసుల ఉదాసీనత వల్ల తన భద్రత ప్రమాదంలో పడిందని, అందుకే కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

అలాగే తనకు వస్తున్న ఈ బెదిరింపుల వెనుక ఉన్న కుట్రను ఛేదించేందుకు కేంద్ర నిఘా సంస్థలతో ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించడమే కాకుండా, తన భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా సింగ్ అమిత్ షాను అభ్యర్థించారు. పాతబస్తీలో అత్యంత ప్రభావవంతమైన హిందూత్వ నాయకుడిగా ఉన్న రాజాసింగ్‌కు గతంలోనూ అనేకమార్లు అంతర్జాతీయ నెంబర్ల నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వయంగా కేంద్ర హోంమంత్రికి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో మరియు ఆయన అనుచరుల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Next Story