ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే

by Disha Web Desk 13 |
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే
X

ముంబై: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచులను బీసీసీఐ ఒక్క మహరాష్ట్రకే పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్-15 ప్రారంభానికి ముందే కేవలం 25 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నట్టు భారత క్రికెట్ నియంత్రణా మండలి ప్రకటన చేసింది.


అయితే, ప్రస్తుతం కరోనా కేసులు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రేక్షకుల సంఖ్యను 50 శాతానికి పెంచాలని మహా సర్కార్ నిర్ణయించింది. కానీ దీనిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మైదానంలో ఆక్యూపెన్సీ రేటును పెంచితే ఎదురయ్యే పరిణామాలపై బీసీసీఐ బోర్డు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో గత ఏడాది ఐపీఎల్ మ్యాచులను బీసీసీఐ యూఏఈలో నిర్వహించింది. ఈసారి కూడా విదేశాల్లోనే మ్యాచులను నిర్వహించాలని భావించినా చివరకు లోకల్‌గానే అన్ని మైదానాల్లో కాకుండా కేవలం మహారాష్ట్రలోని నాలుగు స్టేడియాల్లో నిర్వహించేందుకు తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించాలని అనుకున్నా చివరకు 25 శాతం ప్రేక్షకులను అనుమతించారు.


ఏప్రిల్ 15 తర్వాత సెకండ్ ఫేజ్ లో ఆ సంఖ్యను 50 శాతం పెంచేందుకు బీసీసీఐ సమీక్ష చేయాలని ముందే నిర్ణయించుకుంది. ప్రస్తుతం దీనిపై మహారాష్ట్ర సర్కార్ సానుకూలంగా స్పందించింది. కానీ బోర్డు సభ్యులు మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఒకవేళ బీసీసీఐ అనుమతిస్తే ఏప్రిల్ మొదటి వారం నుంచే ప్రేక్షకులను అనుమతించనున్నారు.

50 శాతం ఎందుకంటే..

ఐపీఎల్‌లో 50శాతం ఆక్యూపెన్సీ రేటును పెంచడానికి సాధారణ ప్రజలకు టికెట్లు దొరక్కపోవడమే కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులు, వాణిజ్య భాగస్వాములకు చెందిన వారే అధిక మొత్తంలో ఐపీఎల్ టికెట్లను దక్కించుకుంటున్నారు.


బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌తో పాటు వాణిజ్య భాగస్వాములు, స్పాన్సర్లు, ఆటగాళ్ళు, పోలీసు, అగ్నిమాపక దళం తో సహా ప్రభుత్వ అధికారులతో పాటు వారికి చెందిన వ్యక్తులను టికెట్లను కేటాయిస్తుండటంతో కామన్ పీపుల్స్‌కు టికెట్స్ దొరకడం లేదు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వెలువడుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఐపీఎల్ అభిమానులకు శుభవార్తే అని చెప్పవచ్చు.

Next Story

Most Viewed