గుర్తు తెలియని మానవ శరీర అవశేషాలు లభ్యం

by Taduka Kalyani |

బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫామ్ రోడ్డు అటవీ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మానవ అస్థిపంజర అవశేషాలు లభ్యం కావడం తీవ్ర సంచలనం రేకెత్తించింది.

గుర్తు తెలియని మానవ శరీర అవశేషాలు లభ్యం
X

దిశ, తిరుమలగిరి : బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫామ్ రోడ్డు అటవీ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మానవ అస్థిపంజర అవశేషాలు లభ్యం కావడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ విషయం కానాజిగూడకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి డయల్ 100 ద్వారా పోలీసులకు ఫోన్ చేసి తెలియజేశారు. ఎస్సై శివ శంకర్ కేసు నమోదు చేసుకొని తెలిపిన వివరాల ప్రకారం.. సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా, అస్థిపంజర అవశేషాలు తప్ప నేరానికి సంబంధించిన మరే ఇతర ఆధారాలు లభించలేదని, విచారణ నిమిత్తం అస్తిపంజరాన్ని సేకరించి ఫోరెన్సిక్ పరీక్ష కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. మృతదేహం వయస్సు,లింగం, మరణించినప్పటి నుంచి గడిచిన కాలం, శాస్త్రీయంగా నిర్ధారించదగిన ఇతర వివరాల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. అస్థిపంజర అవశేషాలు ఆ ప్రదేశానికి ఎలా వచ్చాయనే విషయమై ఎటువంటి నిర్ధారణకు రావడం సాధ్యం కాదని, లభించిన అవశేషాలు గతంలో చట్టబద్ధంగా ఖననం చేయబడినవా,లేక ఇతరత్రా పారవేయబడిన వ్యక్తికి చెందినవి కావచ్చని, అదేవిధంగా అవి ప్రకృతి వైపరీత్యాలు, మానవ కార్యకలాపాలు, ఇతర మధ్యంతర పరిస్థితుల కారణంగా బయటపడి ఉండవచ్చని లేదా స్థానభ్రంశం చెంది ఉండవచ్చనే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని ఎస్సై తెలిపారు. అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకొని, ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల శాస్త్రీయ అభిప్రాయం, దర్యాప్తు సమయంలో వెలుగులోకి వచ్చే ఏవైనా ఇతర ఆధారాల ఆధారంగా విచారణ కొనసాగించనున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story