- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
మార్కెట్లో పత్తి రేటు తగ్గినా రైతులకు నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, వెబ్ డెస్క్ : పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్కెట్లో పత్తి ధరలు పడిపోయినప్పుడు, రైతులకు జరిగే నష్టాన్ని పూడ్చేందుకు ధర లోటు చెల్లింపు పథకాన్ని (Price Deficiency Payment Scheme - PDPS) పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా పత్తి సాగు ఎక్కువగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయడం విశేషం. ఈ పథకం ద్వారా, ఒకవేళ పత్తికి మార్కెట్ ధర కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువగా నమోదైతే, ఆ రెండు ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్' (DBT) ద్వారా జమ చేస్తుంది. దీనివల్ల రైతు తన పంటను ఎవరికి కావాలంటే వారికి అమ్ముకునే స్వేచ్ఛ ఉండటమే కాకుండా, కనీస మద్దతు ధర అందలేదన్న ఆందోళన కూడా ఉండదు.
ఈ PDPS పథకం కేంద్రం చేపట్టిన సమగ్ర వ్యవసాయ పథకం 'PM-AASHA'లో ఒక కీలక భాగం. గత కొంతకాలంగా పత్తి మార్కెట్లో ధరల అస్థిరత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా మాత్రమే పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేయడం సాధ్యం కావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఆ కొరతను అధిగమించేందుకే ఈ ధర లోటు చెల్లింపు విధానాన్ని తెరపైకి తెచ్చింది. రైతులు తమ పత్తిని ఏపీఎంసీ (APMC) యార్డులలో లేదా నోటిఫైడ్ మార్కెట్లలో అమ్మినప్పుడు, ఆ అమ్మకానికి సంబంధించిన ఆధారాలను సమర్పిస్తే, నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆ లోటు మొత్తాన్ని భరిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వ యంత్రాంగంపై భారం తగ్గడంతో పాటు, రైతుకు రావాల్సిన మద్దతు ధర నేరుగా అందుతుంది.
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికారులు ఈ పథకం అమలుకు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. రైతుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం, ఆధార్ లింకింగ్, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించడంపై దృష్టి సారించారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే, దేశవ్యాప్తంగా పత్తి సాగు చేసే రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసే ఆలోచనలో కేంద్రం ఉంది.






