దిగుమతి సుంకం పెంపుతో ఒక్కరోజే రూ. 1,310 పెరిగిన బంగారం ధర!

by Dishanational1 |
దిగుమతి సుంకం పెంపుతో ఒక్కరోజే రూ. 1,310 పెరిగిన బంగారం ధర!
X

ముంబై: బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే ఏకంగా రూ. 1,310 పెరిగిన బంగారం ధర సామాన్యులకు షాక్ ఇచ్చింది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 52,200కి చేరుకుంది. ఆభరణాల వినియోగంలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,200 పెరిగి రూ. 47,850గా ఉంది. బంగారంతో పోలిస్తే వెండి ధర స్వల్పంగా కిలోకు రూ. 100 తగ్గి రూ. 65,000 వద్ద ఉంది.

ప్రభుత్వం దిగుమతులపై సుంకాన్ని పెంచడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధర స్వల్పంగా ఔన్సుకు 1,794 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే, వెండి ధర ఔన్సు 19.76 వద్ద ఉంది. తాజా ధరల ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200 ఉండగా, ఆర్థిక రాజధాని ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో రూ. 52,200, బెంగళూరులో రూ. 52,250గా ఉంది. కాగా, దేశంలో బంగారం దిగుమతులకు గిరాకీ భారీగా ఉండటంతో కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి కారణంగా శుక్రవారం కేంద్రం బంగారం దిగుమతులప సుంకాన్ని 5 శాతం పెంచారు.


Next Story

Most Viewed