భారత సైన్యానికి కొత్త బాస్.. 31వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్!

by Malleboina Mahesh |

భారత సైన్యానికి కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్.. ఉపేంద్ర ద్వివేది స్థానంలో 31వ ఆర్మీ చీఫ్‌గా నియామకం!

భారత సైన్యానికి కొత్త బాస్.. 31వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్!
X

దిశ, వెబ్ డెస్క్: భారత సైన్యానికి కొత్త బాస్‌గా జనరల్ ధీరజ్ సేథ్ (General Dhiraj Seth) అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆర్మీ చీఫ్‌గా సేవలందించిన జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో 31వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపట్టారు. ఈ అత్యున్నత బాధ్యతలను స్వీకరించడానికి ముందు ఆయన దేశానికి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా (VCOAS) సేవలందించారు. జనరల్ ధీరజ్ సేథ్ నియామకంతో భారత సైన్యంలో ఒక అరుదైన రికార్డ్ నమోదైంది. 1997 తర్వాత ఆర్మర్డ్ కోర్ (టాంక్ రెజిమెంట్) విభాగం నుంచి భారత సైన్యాన్ని నడిపించే అత్యున్నత బాధ్యతను దక్కించుకున్న మొదటి అధికారి ఆయనే కావడం విశేషం.

1986 డిసెంబర్‌లో ‘2వ లాన్సర్స్’ రెజిమెంట్‌లో కమిషన్డ్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన జనరల్ ధీరజ్ సేథ్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ మిలిటరీ అనుభవం ఉంది. తన కెరీర్‌లో పాకిస్తాన్ సరిహద్దులతో ముడిపడి ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన ‘సదరన్ కమాండ్’, ‘సౌత్ వెస్ట్రన్ కమాండ్’ రెండింటికీ ఆర్మీ కమాండర్‌గా వ్యవహరించిన అరుదైన ఘనత ఆయన సొంతం. జమ్మూ కాశ్మీర్‌లో కౌంటర్ ఇన్‌సర్జెన్సీ ఆపరేషన్స్, ఐక్యరాజ్యసమితి (UN) శాంతిభద్రతల మిషన్‌లో పనిచేసిన ఆయన విశిష్ట సేవలకు గానూ పరమ విశిష్ట సేవా మెడల్ (PVSM), ఉత్తమ యుద్ధ సేవా మెడల్ (UYSM) లభించాయి. సైన్యంలో ఆధునిక సాంకేతికత, డ్రోన్ల వినియోగాన్ని పెంచడం మరియు ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ (IBG) ల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.

Next Story