మత్తు ఇంజెక్షన్ల ముఠా గుట్టురట్టు..

by Batti.Sumithra |

ఆదిలాబాద్ పట్టణంలో అక్రమంగా కెమికల్ డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టూ టౌన్ పోలీసులు ఛేదించారు.

మత్తు ఇంజెక్షన్ల ముఠా గుట్టురట్టు..
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో అక్రమంగా కెమికల్ డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను టూ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జూలై 12వ తేదీ రాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా స్కూటీపై వెళ్తున్న ఆర్‌ఎంపీ వైద్యుడు సిందే జగన్నాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సర్జరీల సమయంలో మాత్రమే వినియోగించాల్సిన టర్మిన్ మత్తు ఇంజెక్షన్లను మెడికల్ షాపుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, గంజాయి వినియోగదారులు తదితరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.390 ఉండగా, బ్లాక్ మార్కెట్‌లో రూ.1,500 వరకు విక్రయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఆర్‌ఎంపీ సిందే జగన్నాథ్, గెట్‌వెల్ మెడికల్ నిర్వాహకుడు సయ్యద్ కమరుద్దీన్‌తో పాటు మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జగదాంబ ఫార్మసీ నిర్వాహకుడు రమేష్ గౌడ్‌తో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 50 టర్మిన్ ఇంజెక్షన్ బాటిల్స్, 190 ఇన్సులిన్ సిరంజీలు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వైద్య అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన మత్తు ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, ఎస్‌ఐ అఖిల్‌తో పాటు పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.

Next Story